ఐపీఎల్ ఫైనల్ను మించిన ఉత్కంఠతో సాగిన మెగావేలంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ కండ్లు చెదిరే ధర పలికారు. హిట్మ్యాన్ రోహిత్కు దాదాపు సమానంగా ఇషాన్ పదిహేను కోట్ల మార్క్ దాటితే.. మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోనీని మించి దీపక్ చాహర్ పద్నాలుగు కోట్లు కైవసం చేసుకున్నాడు. అనుభవంతో సంబంధంలేకుండా.. ఫ్రాంచైజీలన్నీ ప్రతిభకే పెద్దపీట వేయగా.. అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో పది కోట్లు ఖాతాలో వేసుకున్నారు. గత సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్ పటేల్తో పాటు పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్ వణిండు హసరంగ కోసం బెంగళూరు భారీగా ఖర్చు చేస్తే.. విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ను పది కోట్లు దాటి సన్రైజర్స్ చేజిక్కించుకుంది! విదేశీ ప్లేయర్ల కోసం వెంపర్లాడకుండా.. దేశీయ ఆటగాళ్ల దమ్మును నమ్ముకున్న ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, ఉమేశ్ యాదవ్ వంటి వాళ్లు తొలి రోజు అమ్ముడు పోకుండానే మిగిలిపోయారు!
బెంగళూరు: అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగావేలం.. దేశీయ ఆటగాళ్లపై కనక వర్షం కురిపించింది. తొలి రోజు వేలంలో ఇషాన్ కిషన్ (రూ.15. 25 కోట్లు; ముంబై), దీపక్ చాహర్ (రూ. 14 కోట్లు; చెన్నై) కండ్లు చెదిరే ధర పలకగా.. దాదాపు అన్నీ జట్లు స్వదేశీ ప్లేయర్లకే పెద్దపీట వేశాయి. ఆటగాళ్ల బలాబలాలు తెలిసిన పాత ఫ్రాంచైజీలే వారిని తిరిగి చేజిక్కించుకునేందుకు ఆసక్తి కనబర్చాయి. గత సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ను తిరిగి కైవసం చేసుకోగా.. ధోనీ కనుసన్నల్లోనే ఎదిగిన దీపక్ చాహర్ను తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. తొలి రోజు 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. ఆదివారం కూడా వేలం కొనసాగనుంది. ‘తిరిగి ముంబై జట్టుతో చేరడం ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యుడిలా చూసుకునే ఫ్రాంచైజీతో కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అత్యుత్తుమ ప్రదర్శన చేసి నా ఎంపికకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా’ అని వేలం అనంతరం ఇషాన్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడిన ఇషాన్ ఆ ప్రదర్శనతోనే టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను ఈసారి కోల్కతా నైట్రైడర్స్ రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకోగా.. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 10.75 కోట్లు వెచ్చించింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ పది కోట్లకు దక్కించుకుంటే.. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 8.75 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (10 కోట్లు) అన్క్యాప్డ్ ప్లేయర్గా అవేశ్ ఖాన్ రికార్డుల్లోకెక్కగా.. 20 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన హార్డ్ హిట్టర్ షారుక్ ఖాన్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్లు వెచ్చించింది. రాహుల్ తెవాటియా, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ వంటి దేశీయ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (6.25 కోట్లు; ఢిల్లీ), శిఖర్ ధవన్ (రూ. 8.25 కోట్లు; పంజాబ్ కింగ్స్), రవిచంద్రన్ అశ్విన్ (రూ. 5 కోట్లు; రాజస్థాన్ రాయల్స్)కు కాస్త నిరాశ ఎదురైంది. భారీ ధర పలకడం ఖా యం అనుకున్న వీళ్లంతా ఊహించిన దానికంటే తక్కువ రేటుకే అమ్ముడుపోయారు. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమా ర్ (రూ. 4.20 కోట్లు)ను సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి సొంతం చేసుకోగా.. మహమ్మద్ షమీని రూ. 6.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. దేశీ బ్యాటర్లు, విదేశీ పేసర్లు అనే సూత్రానికి ఫ్రాంచైజీలు పట్టుబట్టినట్లు కనిపించింది. ఫలితంగా ఫెర్గూసన్ (రూ.10 కోట్లు; గుజరాత్), రబడ (రూ. 9.25 కోట్లు; పంజాబ్), ట్రెంట్ బౌల్ట్ (రూ. 8 కోట్లు; రాజస్థాన్), మార్క్వుడ్ (రూ. 7.50 కోట్లు; లక్నో), కమిన్స్ (రూ. 7.25 కోట్లు; కోల్కతా) భారీ ధర పలికారు.
ఆల్రౌండర్లకు పట్టం..
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని షారుక్ ఖాన్తో పాటు రాహుల్ తెవాటియా వేలంలో భారీ ధర పలికారు. 40 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన వీరి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరకు షారుక్ ఖాన్ను పంజాబ్ కింగ్స్ 9 కోట్లకు కొనుగోలు చేయగా.. అంతే మొత్తానికి గుజరాత్ టైటాన్స్ తెవాటియాను దక్కించుకుంది.
చెన్నై మళ్లీ అదే బాట..
లీగ్లో డాడీస్ ఆర్మీగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదే వ్యూహాన్ని కొనసాగించింది. ధోనీ, జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ను అట్టిపెట్టుకున్న చెన్నై.. తాజా వేలంలో వెటరన్ ప్లేయర్లు బ్రేవో (రూ. 4.40 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), రాబిన్ ఊతప్ప (రూ. 2 కోట్లు)ను తిరిగి కొనుగోలు చేసుకోవడం గమనార్హం.
అవేశ్ రికార్డు..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్గా అవేశ్ ఖాన్ రికార్డుల్లోకెక్కాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సత్తాచాటిన ఈ పేసర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా.. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. గతంలో ఈ రికార్డు కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు; చెన్నై సూపర్ కింగ్స్) పేరిట ఉంది.
తొలిరోజు అమ్ముడుపోని ప్రధాన ఆటగాళ్లు
సురేశ్ రైనా, డేవిడ్ మిల్లర్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, సామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, ఆదిల్ రషీద్, ముజీబ్, ఇమ్రాన్ తాహిర్, ఆడమ్ జంపా, అమిత్ మిశ్రా, రజత్ పాటిదార్, అన్మోల్ప్రీత్ సింగ్, హరి నిషాంత్, అజారుద్దీన్, విష్ణు వినోద్, విష్ణు సొలాంకీ, జగదీశన్, సిద్ధార్థ్, సందీప్ లమిచానే.
పది కోట్లు పలికిన పదిమంది
ఇషాన్ కిషన్ – 15.25 కోట్లు (ముంబై)
దీపక్ చాహర్ – 14 కోట్లు (చెన్నై)
శ్రేయస్ అయ్యర్ – 12.25 కోట్లు (కోల్కతా)
హర్షల్ పటేల్ – 10.75 కోట్లు (బెంగళూరు)
వణిండు హసరంగ – 10.75 కోట్లు (బెంగళూరు)
శార్దూల్ ఠాకూర్ – 10.75 కోట్లు (ఢిల్లీ)
నికోలస్ పూరన్ – 10.75 కోట్లు (హైదరాబాద్)
అవేశ్ ఖాన్ – 10 కోట్లు (లక్నో)
ప్రసిద్ధ్ కృష్ణ – 10 కోట్లు (రాజస్థాన్)
ఫెర్గూసన్ – 10 కోట్లు (గుజరాత్)
ఎక్కడ ప్రారంభించానో అక్కడికే..
మొన్నటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం (2009) చేసిన వార్నర్ తిరిగి ఆ జట్టుకే చేరాడు. ‘ఎక్కడ ప్రారంభించానో అక్కడికే చేరాను. జట్టుతో కలిసేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’ అని వార్నర్ పేర్కొన్నాడు.
కృనాల్, దీపక్ ఒకే గూటికి..
దేశవాళీ క్రికెట్లో మనస్పర్థల కారణంగా వార్తల్లోకెక్కిన కృనాల్ పాండ్యా, దీపక్ హుడా ఒకే జట్టుకు చేరారు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఇద్దరినీ కొనుగోలు చేసింది. బరోడాకుఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అశ్విన్, బట్లర్ ఒకే జట్టులో..
మూడేండ్ల క్రితం జరిగిన ఐపీఎల్లో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసి వార్తల్లో నిలిచిన అశ్విన్.. రాబోయే సీజన్లో అతడితో కలిసి ఆడనున్నాడు. అశ్విన్ను కొనుగోలు చేసే విషయంలో బట్లర్తో ముందే చర్చించినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది.
మిగిలిన మొత్తం కోట్లలో..
బెంగళూరు 9.25
కోల్కతా 12.65
పంజాబ్ 28.65
చెన్నై 20.45
ఢిల్లీ 16.50
రాజస్థాన్ 12.15
ముంబై 27.85
హైదరాబాద్ 20.15
లక్నో 6.90
గుజరాత్ 18.85