‘ఆస్తులు కాదు.. ఆరోగ్యం బాగుంటేనే సంతోషంగా ఉన్నట్లు’ అని నమ్ముతారు కొల్లూరి వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ సత్తయ్య. ఆ సంకల్పంతోనే సిరిధాన్యాలతో వండిన పౌష్టికాహారాన్ని ‘బువ్వ బండి’ మీద తీసుకెళ్లి.. ప్రజల కడుపు నింపుతున్నారు.
మన పూర్వికులు సిరిధాన్యాల భోజనాన్నే తిన్నారు. ఎలాంటి రోగాలూ లేకుండా, వందేండ్ల దాకా బతికారు. ప్రస్తుతం రసాయన పంటలూ, ప్రాసెస్డ్ ఫుడ్తో నలభై ఏండ్లకే ముసలివాళ్లలా తయారవుతున్నారు. చిన్న వయసులోనే షుగర్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ, గుండె జబ్బులు తదితర సమస్యల బారిన పడుతున్నారు. అందుకే, అందరికీ బలవర్ధకమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ‘బువ్వ బండి’ని ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన సత్తయ్య. తన కొడుకు, కౌన్సిలర్ భరత్ కుమార్తో కలిసి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ బండి ద్వారా సత్తువనిచ్చే ఆహారం అందించడంతోపాటు సిరిధాన్యాల ప్రాముఖ్యాన్నీ తెలియజేస్తున్నారు. ఇక్కడ కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలతో చేసిన భోజనాన్ని మాత్రమే వడ్డిస్తారు. ఆదివారం మినహా.. రోజూ ఒక్కో అన్నం వండుతారు. అందులోకి పప్పు, పచ్చడి, గంజి, పెరుగు అందిస్తారు. సిరిధాన్యాలను సాయంత్రం నానబెట్టి మరుసటి రోజు వండుతారు. రోజూ 25 కేజీల అన్నం, 15 కేజీల పప్పు వడ్డిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ కార్యక్రమం సాగుతుంది. ‘బువ్వ బండి’ నిర్వహణకు ముగ్గురు ఉద్యోగులను కూడా నియమించుకొన్నారు.
మన యాసలోనే..
రోడ్ల పక్కన ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటిన్లే. వాటిలో ప్రత్యేకంగా కనిపించేలా.. ఎడ్ల బండిపై ఇంటి నమూనాలో చెక్కలతో క్యాంటిన్ నిర్మించారు సత్తయ్య. ఆలోచనే కాదు.. ఆచరణ కూడా పాతతరాన్ని తలపించాలనే ఉద్దేశంతో ఈ వాహనానికి ‘బువ్వ బండి’ అని పేరు పెట్టారు. తెల్లాపూర్లోని ఇందిరానగర్ కాలనీ రేడియల్ రోడ్డు వద్ద అన్న వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం సిరిధాన్యాల వంటకాలను ఎడ్లబండిలోనే ఇక్కడికి తీసుకొస్తారు. ఆకలితో వచ్చినవారికి ఉచితంగా ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందిస్తారు. ‘కడుపు నిండా మాత్రమే కాదు, మనసునిండా తింటున్నాం. ఈ అన్న సేవను ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తే బాగుంటుంది’ అంటున్నారు ఇక్కడికి వచ్చినవారు. సిరి భోజన దాతా.. సుఖీభవ!
సాయం చేయాలనే..
పేదలకు సాయం చేయాలన్న తపనతో మా అమ్మ పేరున కొల్లూరి వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. కరోనా లాక్డౌన్ సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 7వేల మంది పేదలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశాం.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, బలవర్ధకమైన భోజనం అందించడానికి ‘బువ్వ బండి’ని మొదలుపెట్టాం. నేను కూడా ఆరు నెలలుగా సిరిధాన్యాల భోజనాన్నే తింటున్నా. ఇవి తింటే దవాఖానకు వెళ్లాల్సిన అవసరం రాదు. నిత్యం 300 మందికి భోజనం వండుతున్నాం. రోజూ రూ.15వేల వరకు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా రాజీ పడటం లేదు.
కొల్లూరి సత్తయ్య, ‘బువ్వ బండి’ నిర్వాహకుడు
… పానుగంటి బాలకృష్ణ