లండన్: వింబుల్డన్లో సెరీనా విలియమ్స్కు అనూహ్య పరాజయం ఎదురైంది. తొలి రౌండ్లోనే ఆమె నిష్క్రమించింది. ఫ్రాన్స్కు చెందిన హర్మనీ టాన్ చేతిలో ఆమె ఓటమి పాలైంది. 23 సార్లు గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరీనా.. 5-7, 6-1, 6-7 (7) స్కోర్తో టాన్ చేతిలో ఖంగుతిన్నది. నిజానికి సెరీనా ఈ మ్యాచ్ నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దాదాపు మూడు గంటల పది నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. గత ఏడాది వింబుల్డన్ తొలి రౌండ్లో గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న సెరీనా ఈసారి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఓపెనింగ్ సెట్ను సెరీనా 5-7 తేడాతో కోల్పోయింది.
ఇక రెండవ సెట్లో తన సత్తా చాటింది. ఆ సెట్ను 6-1 తేడాతో కైవసం చేసుకున్నది. కానీ డిసైడింగ్ మూడవ సెట్లో మ్యాచ్ ఆసక్తిని రేపింది. ఓ దశలో మ్యాచ్ పాయింట్ను సేవ్ చేసి టై బ్రేకర్ వచ్చేలా చేసింది. టై బ్రేకర్లోనూ 4-0 తేడాతో లీడింగ్లో ఉన్న సెరీనా అనూహ్య రీతిలో మ్యాచ్ను కోల్పోయింది. సెరీనాపై నెగ్గిన హర్మనీ టాన్కు ఇదే తొలి వింబుల్డన్ టోర్నీ. మార్గరేట్ కోర్ట్ పేరిట ఉన్న 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు సెరీనా మరింత కాలం వేచి చూడాల్సిందే. వింబుల్డన్లో ఇది తనకు చివరి మ్యాచ్ కాదు అని, భవిష్యత్తులో ఆ టోర్నీలో ఆడనున్నట్లు సెరీనా చెప్పింది.