సూరత్: సమిష్టి ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్న డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్, మహారాష్ట్ర జట్లు సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన సెమీస్లో 35 పరుగుల తేడాతో ఒడిశాను చిత్తు చేసి రైల్వేస్ తుది పోరుకు అర్హత సాధించగా.. అంతకుముందు జరిగిన తొలి పోరులో మహారాష్ట్ర 6 వికెట్ల తేడాతో బరోడాను ఓడించి ఫైనల్కు చేరింది. ఇరు జట్ల మధ్య బుధవారం టైటిల్ పోరు జరుగనుంది. తొలి సెమీస్లో మొదట బ్యాటింగ్కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లకు 121/7 పరుగులు చేసింది.
యస్తిక భాటియా (45 బంతుల్లో 71; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరువగా.. మోహిత (22) రాణించింది. తక్కినవాళ్లంతా విఫలమవగా.. మహారాష్ట్ర తరఫున ఉత్కర్ష పవార్ 3, ముక్త మర్గె 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన స్మృతి మందన సేన 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ శివాలి షిండే (37 బంతుల్లో 44), తేజల్ హసన్బిస్ (33) శుభారంభనివ్వగా.. ముక్త (10)తో కలిసి దేవిక వైద్య (21 నాటౌట్) జట్టును గెలిపించింది.
రెండో పోరులో.. మేఘన (63 బంతుల్లో 84; 9 ఫోర్లు, ఒక సిక్స్), నుజాత్ పర్వీన్ (55 నాటౌట్; నాలుగు ఫోర్లు) వీరవిహారం చేయడంతో రైల్వేస్ నిర్ణీత 20 ఓవర్లకు 159/2 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ఒడిశా 124/7 రన్స్కే పరిమితమైంది. మాధురి (35), కాజల్ (24), సుశ్రీ దివ్యదర్శి (29) మినహా మిగతా ప్లేయర్లు విఫలమవగా.. రైల్వేస్ తరఫున స్వాగతిక రాఠ్, తనూజ తలా రెండు వికెట్లు పడగొట్టారు.