చిక్కడపల్లి, ఫిబ్రవరి 22 : తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేది నిరంతం జరుగాల్సిన ప్రక్రియ అని సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆవిర్భావ సమావేశం ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టంకశాల అశోక్ మాట్లాడారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకునే వాళ్లకు, తెలంగాణవాదులకు మధ్య భావజాల ఘర్షణ జరుగుతున్నదని ఈ సవాల్ను ఓపికగా, క్రమపద్ధతిలో ఎదుర్కోవాలని అని అభిప్రాయపడ్డారు. ఎంతోమంది వ్యతిరేకులు ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మన అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్టేనని, వారు చెప్పే లాజిక్ను కొందరైనా నమ్ముతారు కాబట్టి నిరంతరం భావజాల వ్యాప్తి చేయాలని సూచించారు. ఇందుకోసం అందరినీ చైతన్యపర్చాల్సి అవసరం ఉన్నదని తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడానికి ఒక కార్యాచరణ కావాలని తెలిపారు. నిరంతర భావజాల వ్యాప్తి అవసరమని ప్రొఫెసర్ సీతారామారావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉనికికే ప్రధానమైన అస్తిత్వ భావజాల ప్రచారం జరుగాలని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం పట్ల నిబద్ధత ఉన్న వాళ్లతో సమన్వయంతో పని చేయాలని చెప్పారు.
ఆంధ్ర వలసవాదం పొంచి ఉన్న పులిలాంటిందని, ఇది ప్రభుత్వంతో జత కలిసిందని ఈ కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ పరాంకుశం వేణుగోపాలస్వామి మాట్లాడుతూ తెలంగాణ వచ్చే నాటికి సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టారని, దీనికి పరాయి పాలకులే కారణమనే విషయం చాలామందికి తెలియదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక ప్రశ్నలు లేవనెత్తారని, కానీ ఉద్యమ సమయంలో వాటిన్నంటికీ దీటైన జవాబు ఇచ్చామని పేర్కొన్నారు. మీడియా లేకపోవడం, రాజకీయ శక్తులు బలహీనంగా ఉండటం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఇప్పుడు నిలదొక్కుకోవాల్సి ఉన్నదని, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరూ కలిసి రావాలని కోరారు. అనంతరం తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అవగాహన పత్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం కన్వీనర్ డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ములక సురేశ్కుమార్, జీ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాజిద్ ఖాన్, ఎస్వీసీ ప్రకాశ్, డాక్టర్ లక్ష్మణ్, రూబీ స్లీవెన్సన్, ఆసరి రాజు, పెద్దూరి వెంకన్న, యముగంటి ప్రభాకర్ పాల్గొన్నారు.