ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంతకుముందు ఈయన సినిమా చేస్తున్నాడంటే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఎదురు చూసే వాళ్లు. కానీ ఫిదా అన్ని వర్గాల ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం దాదాపు 50 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో శేఖర్ కమ్ముల స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తన సినిమాల్లో సున్నితమైన భావోద్వేగాలను అత్యంత సున్నితంగా చూపిస్తుంటాడు శేఖర్. అంతేకాదు ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది డిఫెరెంట్ స్టైల్. తనదైన శైలిలో మాయ చేస్తుంటాడు ఈ దర్శకుడు. ఫిదా తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ప్రేమకథ లవ్ స్టోరి. ఈ రియలిస్టిక్ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.
లవ్ స్టోరి నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సారంగ దరియా పాట అయితే యూ ట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తుంది. మరోవైపు ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రాణంగా నిలుస్తుంది. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఓ సెన్సేషనల్ పాయింట్ చెప్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు ఏ దర్శకుడు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడే సున్నితమైన పాయింట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే ఓ వ్యక్తిగత సమస్యను లవ్ స్టోరీ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ఎవరూ తీసుకోలేదు. యాడ్స్ లో మాత్రమే తమ బ్రాండింగ్ కోసం వాడుకున్నారు. అదే పాయింట్ తీసుకుని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తున్నాడు శేఖర్ కమ్ముల. పూర్తిగా శేఖర్ కమ్ముల నెరేషన్ పైనే చిత్రయూనిట్ విజయంపై నమ్మకంగా కనిపిస్తుంది. ఎప్రిల్ 16న లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది.