ఇంఫాల్ : మణిపూర్ టెగ్నౌపాల్ జిల్లాలో భారత్ – మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మణిపూర్ పోలీసులు, అసోం రైఫిల్స్ సంయుక్త బృందం మోరే పట్టణం, ఎస్ మోల్జోల్ గ్రామంలోని ఒక వ్యక్తికి చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించి.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇందులో రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు ఎం16 రైఫిల్స్, మూడు 9 ఎంఎం పిస్టల్స్, ఒక చైనీస్ మేడ్ గ్రెనేడ్, ఏకే-56, ఎం-16 తొమ్మిది మ్యాగజైన్లు, 9 ఎంఎం పిస్టల్తో పాటు నాలుగు మ్యాగజైన్లు, 361 లైవ్ రౌండ్లు ఉన్నాయని చెప్పారు. పలు ఆయుధాల లైవ్ రౌండ్లు, చిన్న క్యాలిబర్, ఒక 8ఎక్స్ బైనాక్యులర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మోరే పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.