కేవలం కేంద్రం పట్టింపులేనితనం వల్ల.. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది నగరవాసులు ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నారు. కంటోన్మెంట్ దారుల్లోకి రాగానే నిత్యం నరకం చవిచూస్తున్నారు. కోటిమందికి పైగా జనాభా ఉండే ఈ మహానగరంలో అన్ని రోడ్లు సాఫీగా రాకపోకలకు అనుకూలంగా ఉంటే మిలటరీ ఏరియా పేరుతో 21 రోడ్లు మూసివేశారు. రకరకాల ఆంక్షలు పెట్టారు. వీటిని ఎత్తివేసి రోడ్లను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేశారు. నేరుగా కలిసి విన్నవించారు. లేఖలు రాశారు. ట్వీట్ల ద్వారా కూడా తెలియజెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. నగరసమస్యలపై అవగాహన ఉండి, నిత్యం సిటీలోనే ప్రయాణించే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ సమస్యకు వక్రభాష్యం చెబుతున్నారు.
కేవలం రెండే రోడ్లు మూసివేశారంటూ అబద్ధాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధే ఇలా సమస్యను వెనకేసుకు రావడమేమిటని నగర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న వారి బాధ్యతారాహిత్యాన్ని తూర్పారబడు తున్నారు. కాగా ఈ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ నగర శ్రేణులు రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుమలగిరిలో గోల్డెన్ పాల్మ్ ఎన్క్లేవ్ రోడ్డు గేటు వద్ద ధర్నా
నిర్వహించారు. ఏఓసీ రోడ్లను తెరిచే నిర్ణయం తీసుకోకపోతే రానున్న పక్షం రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తేతెలంగాణ/సికింద్రాబాద్ : కంటోన్మెంట్..ఒకప్పుడు శివారు ప్రాంతం..మిలటరీ కార్యకలాపాలకు కేటాయించిన ప్రదేశం. క్రమంగా నగరం వేగంగా విస్తరించింది. ఇంకా విస్తరిస్తున్నది. కంటోన్మెంట్ దాటి గృహాలు, వాణిజ్య భవనాలు వెలిశాయి. ఫలితంగా నగరంలోకి రావాలంటే కంటోన్మెంట్ రోడ్లే మార్గం. ఈ రహదారులను చెప్పాపెట్టకుండా మూసివేస్తూ ఆర్మీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గతంలో రాత్రివేళల్లో ఆంక్షలు విధించేవారు. ఇప్పుడు రాత్రిపగలు తేడా లేకుండా రోడ్లను మూసివేస్తుండడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కిలోమీటరు దూరానికి పదికిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత తెలిసి కూడా..బాధ్యతారాహిత్యంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి రెండు రోడ్లే మూసివేస్తున్నారని..వ్యాఖ్యానించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవిస్తే ఆయనకు తెలుస్తుంది మా బాధ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్తో తెరపైకొచ్చిన ఈ సమస్యపై మంగళవారం గులాబీ దళం నిరసన వ్యక్తం చేసింది. ప్రజలకు అండగా నిలిచి…సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేసింది. అదే సమయంలో వాహనదారులు బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు ఆర్మీ రహదారుల మూసివేతతో లక్షలాదిమంది వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
ఇప్పటికే రాత్రివేళల్లో ఆంక్షల్ని అమలు చేస్తుండగా, తాజాగా 20 రహదారులను పగటిపూట కూడా మూసివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కంటోన్మెంట్ బోర్డులో ప్రాతినిధ్యం వహించిన బోర్డు మాజీ సభ్యులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం మిలటరీ అధికారులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. కంటోన్మెంట్ నిధులతో అభివృద్ధి చేసిన రోడ్లపైకి సాధారణ పౌరుల రాకపోకల్ని ఎలా నిషేధిస్తారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా మిలటరీ అధికారుల వాదన మరోలా ఉంది. కంటోన్మెంట్లో పెరిగిపోయిన ట్రాఫిక్ వల్ల తమ శిక్షణ కార్యకలాపాలు, ఇతరత్రా విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీబీ) చాలా భిన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగమైన ఎస్సీబీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కంటోన్మెంట్. మొత్తం 10 వేల ఎకరాల్లో మూడు భాగాలుగా విస్తరించిన ఎస్సీబీ పరిధిలో సుమారు 6 వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలోనే ఉన్నాయి. 3 వేల ఎకరాల పరిధిలో కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతం ఉంది. మిగతా వెయ్యి ఎకరాల్లో బేగంపేట ఎయిర్పోర్టు, బీ-3, బీ-4 కేటగిరీ స్థలాలున్నాయి. ఏండ్ల తరబడి కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల (ఇప్పుడు జీహెచ్ఎంసీలో భాగమయ్యాయి) ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ రోడ్లను వినియోగిస్తూ వచ్చారు. గత పదేండ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందనే కారణంతో వివిధ రోడ్లపై సివిలియన్ల రాకపోకలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి.
కంటోన్మెంట్ రహదారుల మూసివేత 2015-16 నుంచే తీవ్రతరమైంది. గతంలోనూ మూసివేత ఉన్నప్పటికీ కొంతకాలం పాటు, సందర్భానుసారం ఉండేది. కానీ కొంతకాలంగా తరచూ పదుల సంఖ్యలో రోడ్లను మూసివేస్తూ జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా జరిగిన ప్రతిసారి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి కేంద్రానికి లేఖలు రాయడం, తన ట్వీట్ల ద్వారా కేంద్రం దృష్టికి సమస్యను ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా 20 రహదారులను మూసివేయడంపై ఆ ప్రాంతవాసులు సామాజిక మాధ్యమాల్లో తమ ఇబ్బందులను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రజల వెతలు ప్రతిబింబించేలా సమస్యపై ట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్నా సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పట్టించుకోకపోవడం విడ్డూరం.
కంటోన్మెంట్ రహదారుల మూసివేత సరికాదు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు వెంటనే ఆపాలి. ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. వెంటనే మూసివేసిన
రోడ్లను తెరిచి వాహనాలను అనుమతించాలి.- ప్రశాంత్, బొల్లారం
రహదారుల మూసివేత వల్ల వాహనదారులపై భారం పెరుగుతోంది. ప్రతిరోజు తిరుమలగిరి మీదుగా ఇదే దారిలో ప్రయాణిస్తా. ఒకవేళ ఈ దారి మూసివేస్తే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల పెట్రోలు ఖర్చు తడిసిమోపెడవుతున్నది. – నదీమ్, మెహిదీపట్నం
కంటోన్మెంట్ పరిధిలోని ఆయా రోడ్లు మూసివేస్తుండడంతో ఇక్కట్ల పాలవుతున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండానే మూసివేయడంతో కిలోమీటరు దూరానికి 9 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. బాలాజీనగర్ నుంచి బొల్లారం, తిరుమలగిరి రావాలంటే ఎప్పుడు ఏ రోడ్లు మూసివేస్తారో తెలియని దుస్థితి నెలకొన్నది. – రాజయ్య, ఆటోడ్రైవర్, బాలాజీనగర్
గత ఎనిమిదేళ్లుగా లకడావాలా రోడ్డును మూసివేయడంతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క రోడ్డుతోనే ఆగకుండా ఇప్పటివరకు 21 రహదారులను మూసివేసి స్థానికుల ఉపాధి దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని పెద్దలు చొరవ తీసుకొని రహదారులను తెరిపించాలి. – శేఖర్, డ్రైవర్, కౌకూర్
బొల్లారం నుంచి యాప్రాల్కు వెళ్లాలంటేనే భయమేస్తున్నది. ఉదయం వచ్చిన దారి వెంట మళ్లీ ఇంటికి వెళతామో లేదో తెలియని దుస్థితి నెలకొన్నది. బొల్లారం చర్చి పక్కనే ఉన్న గేటును అధికారులు ఇష్టానుసారం మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బొల్లారం ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించడం ఎంతవరకు సమంజసం. మూసివేసిన 21 రోడ్లను వెంటనే తెరవాలి. – చంటి, వాహనదారుడు, యాప్రాల్
కంటోన్మెంట్లో ఆర్మీ ఆంక్షలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సివిలియన్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీ (ఎంసీహెచ్)లో విలీనం చేయాలని 1998లో స్థానిక ఎమ్మెల్యేగా తీవ్ర ప్రయత్నం చేశాను. ఇందుకు అప్పటి ఎన్డీఏలోని రక్షణశాఖ మంత్రి అనుకూలంగా ఉన్నప్పటికీ, అప్పటి బోర్డు సభ్యులు సహకరించలేదు. రోడ్లపై ఆంక్షల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రజా ఉద్యమంతోపాటు, న్యాయపోరాటం కూడా చేస్తాం. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు కనీసం సమాధానం ఇచ్చే దమ్ము బీజేపీ నేతలకు లేదు. -సాయన్న, కంటోన్మెంట్ ఎమ్మెల్యే
ఆర్మీ కంటోన్మెంట్లోని పలు రహదారులను సివిలియన్ కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి చేశాం. కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఒక్కొక్కటిగా మూసివేస్తూ వస్తున్నారు. దీంతో సమీప కాలనీలతో కంటోన్మెంట్ ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అందాల్సిన సర్వీసు చార్జీలు సకాలంలో అందడం లేదు. తాజాగా ఈ బకాయిలు రూ.675 కోట్లకు చేరడం గమనార్హం. ఈ నిధుల్ని అందిస్తే అంతర్గతంగా రోడ్లను విస్తరించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసే వీలు కలుగుతుంది. – జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు
ఎప్పుడు ఏ రోడ్డు మూసివేస్తారో తెల్వక నిత్యం ఇబ్బందులు పడుతున్నం. ప్రధాన రోడ్లను మూసివేస్తుండడంతో చుట్టూ తిరిగి ఇంటికి చేరుకుంటున్నాం. ఉదయం తెరిచి ఉంచే దారి సాయంత్రానికి మూసివేస్తున్నారు. కూకట్పల్లి నుంచి లోతుకుంట మీదుగా యాప్రాల్ వెళ్లాలంటే సుమారు 9 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారుల ఇబ్బందులను పట్టించుకోవాలి. – వికాస్, ప్రైవేట్ ఉద్యోగి, కూకట్పల్లి
స్థానికంగా ఉండే తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఇక్కడికి వచ్చి చూస్తే కేంద్ర మంత్రులకు తెలుస్తుంది. నిత్యం ఏదొక సాకుతో రోడ్లను మూసివేస్తున్నారు. రెండు రోడ్లే మూసివేశారని కేంద్ర మంత్రి అసత్య ప్రచారం చేస్తున్నారు. 21 రోడ్లు మూసివేయడంతో వాహనదారులు గేట్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. కేంద్రం సూచనలు, ఆదేశాలను ఇక్కడి మిలటరీ అధికారులు పట్టించుకోవడం లేదు. – ప్రభాకర్, రిసాలబజార్, బొల్లారం
ప్రతినిత్యం తిరుమలగిరి నుంచి యాప్రాల్కు రాకపోకలు సాగిస్తుంటాను. ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసే తాను కంటోన్మెంట్ నుంచి ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంటుంది. కరోనా కల్లోలం నాటి నుంచి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఏ రోడ్డు మూసివేస్తారో అర్థం కావడం లేదు. చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న తనకు యాప్రాల్లోని ఇంటికి చేరుకోవాలంటే రోడ్లు మూసివేస్తే నరకంగా మారింది. కేంద్రం ఇప్పటికైనా రహదారులను మూసివేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, ప్రైవేట్ ఉద్యోగి, తిరుమలగిరి
కంటోన్మెంట్ పరిధి నుంచి జీహెచ్ఎంసీలోకి ప్రవేశించాలంటే ప్రహసనంగా మారుతున్నది. ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్లాలంటే మాట్లాడుకునే ధరకు, రోడ్లు మూసివేసి ఉంటే చుట్టూ తిరిగి వెళ్లితే గిట్టుబాటు కావడం లేదు. వచ్చే ఆదాయం డీజిల్, పెట్రోల్కే సరిపోతుంది. తిరుమలగిరి నుంచి మల్కాజిగిరికి బయలుదేరితే ఎక్కడి నుంచి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాం. – రాము,ఆటోడ్రైవర్, లాల్బజార్
సికింద్రాబాద్, డిసెంబర్ 21: కేంద్రమంత్రి స్థాయిలో ఉండి కిషన్రెడ్డి అసత్యాలు చెబుతున్నారని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో అనేక రోడ్లు మూసివేస్తున్నారని, బీజేపీ నేతలకు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. రహదారుల మూసివేతపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ మంగళవారం తిరుమలగిరిలో మూసివేసిన గోల్డెన్ పాల్మ్ ఎన్క్లేవ్ రోడ్డు గేటు ఎదుట టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కంటోన్మెంట్ ప్రాంతంలో పలు రహదారులను మూసివేయడం వల్ల వాహనదారులలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ల మూసివేతపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే…అంతా బాగుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పడం సమంజసం కాదన్నారు. కంటోన్మెంట్ బోర్డు అనుమతి లేకుండా రహదారులను మూసేయ్యొద్దని ఇచ్చిన ఆదేశాలను లోకల్ మిలటరీ అథారిటీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.