సికింద్రాబాద్, నవంబర్ 29: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా నియమితులైన జే రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బోర్డు కార్యాలయంలో వేరీడ్ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్న బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక బోర్డు సమావేశంలో ఆయన మూడో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి కంటోన్మెంట్ బోర్డు పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ముగియగా, మరుసటి రోజు నుంచి వేరీడ్ బోర్డు మనుగడలోకి వచ్చింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సివిలియన్ మెంబర్గా రామకృష్ణను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా పూర్తిస్థాయి వేరీడ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలో పరిమిత సంఖ్యలో మాత్రమే అంశాలను అజెండాలో చేర్చారు. వివిధ అంశాలపై జారీ చేసిన 20 సర్కులర్ ఎజెండాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అదే విధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సందర్శన నేపథ్యంలో నిర్మించిన రోడ్ల మరమ్మతులకు బోర్డు ఆమోదం తెలిపి లభించింది. బోర్డు పరిధిలో నూతన నల్లా కనెక్షన్లకు సంబంధించి నిర్ణయించిన రోడ్ కటింగ్ చార్జీలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. అయితే బస్తీవాసులకు నల్లా కనెక్షన్ జారీకి సంబంధించి ఎలాంటి చార్జీలు వసూలు చేయవద్దని రామకృష్ణ బోర్డును కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం సర్వీసు చార్జీలు ఎందుకివ్వడం లేదనే చర్చ కొనసాగింది.