సిటీబ్యూరో, నవంబరు 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకమైన స్కోచ్ – 2021 సిల్వర్ అవార్డును గెల్చుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆన్లైన్లో స్వీకరించారు. ఈ అవార్డు దక్కినందుకు సీపీ సంతోషం వ్యక్తం చేశారు. నిబద్ధతతో, నిజాయితీతో ప్రజలకు అందిస్తున్న సేవలకు సిటీ పోలీసులకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాబ్ కనెక్ట్ కార్యక్రమాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్వహణ, పోలీసు ఉద్యోగాలకు ప్రి-రిక్రూట్మెంట్ కార్యక్రమాలను చేపట్టి చాలా మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు స్కోచ్ అవార్డు అర్హతలో ఫైనల్కు చేరుకుని సిల్వర్ బహుమతిని పొందింది. జాబ్ కనెక్ట్లో భాగంగా దాదాపు ఐదువేల మంది నిరుద్యోగులు నమోదయ్యారని తెలిపారు. అదే విధంగా దాదాపు ఐదువేల మంది యువత, నిరుద్యోగులు పోలీసులు నిర్వహించిన ప్రి-రిక్రూట్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు 1017 మంది అభ్యర్థులు పోలీసు శాఖలో ఎంపికయ్యారని సీపీ వివరించారు. తెలంగాణ పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కల్పించి వారి నియామకాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విధానాన్ని అభినందిస్తూ ఈ క్రమంలో మహిళల ఎంపికకు అవసరమయ్యే అన్ని చర్యలను తీసుకోవడంతో ఇప్పుడు పోలీసు శాఖలో చేరడానికి మహిళలు ఆసక్తి చూపుతుండటం సంతృప్తికరంగా ఉందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. స్కోచ్ అవార్డు నిర్వాహకులు హైదరాబాద్ సిటీ పోలీసు సేవలను గుర్తించి అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులు మరింత ఉత్సాహంతో పని చేయడానికి ప్రోత్సహిస్తాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు.