తెలుగులో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘శాకినీ డాకినీ’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్నది. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో ఐటెంసాంగ్లో చిందేయనుంది. తాజాగా ఆమె ఓ సోషల్ సెటైరికల్ సినిమాలో భాగం అవుతున్నది. రెజీనా, సుబ్బరాజు, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకుడు. సోమవారం హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘సమకాలీన సామాజిక పరిస్థితులపై వ్యంగ్యాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. వైవిధ్యమైన కథ, కథనాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఝాన్సీ, సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్ ఎల్లూ మహంతి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ, మాటలు: బీవీఎస్ రవి, నిర్మాణ సంస్థ: రా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా, దర్శకత్వం: సుబ్బు వేదుల.