‘సర్కారు వారి పాట’ చిత్రానికి మొదటి ఆట నుంచే బ్లాక్బస్టర్ హిట్ అనే టాక్ వచ్చింది. మా రెండేళ్ల కష్టానికి ఈ విజయంతో ప్రతిఫలం లభించింది. రెండు వారాల పాటు భారీ కలెక్షన్లతో దూసుకుపోవడం ఖాయం’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మహేష్బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ చిత్రం గురువారం ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్బస్టర్ మీట్ను నిర్వహించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సుదర్శన్లో సినిమా చూశాం. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూఎస్ ప్రీమియర్ మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను అధిగమించింది’ అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ ‘మాస్తో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్కు ఈ సినిమా బాగా నచ్చింది. దేశ ప్రజలందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐలతో ఇబ్బంది పడని మధ్యతరగతి మనుషులు ఉండరు. అలాంటి గొప్ప సామాజిక సందేశాన్ని మహేష్బాబు వంటి స్టార్తో చెప్పించడం ప్లస్ అయింది. దర్శకుడిగా, రచయితగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి ఆస్వాదించండి’ అన్నారు.