‘థియేటర్, ఓటీటీ అనే భేదాలు నాకు లేవు. వేదిక ఏదైనా నా నటనను పూర్తిగా ఆస్వాదించడానికే ప్రయత్నిస్తా’ అని అన్నారు సంతోశ్ శోభన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకుడు. వి సెల్యులాయిడ్తో కలిసి ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సంతోష్శోభన్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
‘ఏక్మినీకథలో’ నా నటన నచ్చడంతో మారుతి ఈ అవకాశం ఇచ్చారు. అతి భయాలు, ఆందోళనలు మనుషుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? వాటికి జీవితంలో ఎంతవరకు ప్రాముఖ్యతనివ్వాలనే పాయింట్తో మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. భయం జీవితాన్ని ఆక్రమిస్తే తలెత్తే అనర్థాల్ని అర్థవంతంగా ఈ సినిమాలో చూపించారు. చక్కటి సందేశంతో పాటు మారుతి మార్కు కామెడీ ఉంటుంది
ఇమేజ్ పట్టింపులు లేవు
రేపనేది ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి తరుణంలో భవిష్యత్తు ప్రణాళికలు, ఇమేజ్ లెక్కలు వేసుకుంటూ సినిమాలు చేయడంలో అర్థంలేదు. వర్తమానంలోనే బతుకుతా. నటుడిగా ముందుకు సాగుతాననే విశ్వాసం ఉంది. కానీ సెటిల్ అయ్యాననే నమ్మకం మాత్రం పెట్టుకోను. అలాంటి భావన వస్తే రిలాక్స్ అయిపోయి అవకాశాల్ని కోల్పోతాం. ప్రతి రోజూ పోరాటం చేస్తూ ఉండాలన్నదే నా ఆలోచన.
శ్రీదేవి శోభన్బాబు..
హీరోగా ఈ స్థాయికి చేరుకోవడంలో మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. ఇప్పటివరకు కుటుంబాన్ని పోషించే డబ్బును నేను సంపాదించలేదు. అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే ఇబ్బందులు పడకుండా నాకు ఇష్టమైన నటనలో కొనసాగుతున్నా. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’తో పాటు చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్న ‘శ్రీదేవి శోభన్బాబు’ లో నటిస్తున్నా. యువీ క్రియేషన్స్లో మరో సినిమా అంగీకరించా.