వింబుల్డన్: కెరీర్లో చివరిసారి వింబుల్డన్ బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు ఆల్ఇంగ్లండ్ క్లబ్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించలేకపోయిన సానియా.. ఈ సారైనా తన కల నెరవేర్చుకోవాలనుకుంటే.. ఆ ఆశ తీరలేదు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సానియా-పావిచ్ (క్రొయేషియా) జోడీ 6-4, 5-7, 4-6తో టాప్ సీడ్ నీల్ (బ్రిటన్)-క్రాజిక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
గంటా 16 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ నెగ్గిన సానియా జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో ప్రభావం చూపలేకపోయింది. కెరీర్లో ఇప్పటి వరకు ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న సానియా మీర్జా.. మిక్స్డ్ డబుల్స్లో మూడు (2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2014 యూఎస్ ఓపెన్) ట్రోఫీలు ఖాతాలో వేసుకుంది. ఈ సారి వింబుల్డన్ కూడా చేజిక్కించుకోవాలనుకున్న హైదరాబాదీకి సెమీస్లో చుక్కెదురైంది. ఈ సీజన్ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలుకనున్నట్లు సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.