రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మత్తు పదార్థాల విక్రయాలపై అధికారులు మరింత నిఘా పెంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో గంజాయి సాగు నిర్మూలిస్తూ, ఎక్సైజ్, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తూనే ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో చేసిన తనిఖీల్లో అధికారులు ఆశ్చర్యపోయే విషయాలు బయటపడుతున్నాయి. మత్తు పదార్థానికి రూపం మారుస్తూ విక్రయిస్తున్నారని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల నిర్వహించిన దాడుల్లో లిక్విడ్(హాషిశ్ ఆయిల్), చాకెట్ల రూపంలోకి మార్చిన గంజాయి పట్టుబడిందని అధికారులు తెలిపారు. ‘నిషా’పై నిఘా పెంచడంతో ఎక్కడ కూడా చిక్కకుండా ఇలాంటి సరికొత్త పద్ధతుల్లో యువతకు అమ్మకాలు సాగిస్తున్నట్లు వెలువడింది. ఇటీవల పటాన్చెరు, సంగారెడ్డిలో పెద్ద సంఖ్యలో ఎక్సైజ్ అధికారులు హాషిశ్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. ఎండుగంజాయి అమ్మకాలతోపాటు హాషిశ్ ఆయిల్, గంజాయి చాకెట్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి, మత్తును చిత్తు చేసేందుకు పోలీసు, ఎక్సైజ్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
సంగారెడ్డి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో గంజాయి డీలర్లు, ఏజెంట్లు పోలీసులకు చిక్కకుండా సరికొత్త పద్ధతుల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ) నుంచి ఎక్కువగా జిల్లాలో ఎండుగంజాయి రవాణా అవుతున్నది. ఏవోబీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి అక్రమంగా రావాణా అవుతున్నా ఎండుగంజాయిని అడ్డుకునేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి అమ్మకాలను నిలువరించేందుకు దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు. అయినా జిల్లాలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఎక్సైజ్, పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి రవాణా, అమ్మకాలు జరిపే డీలర్లు పోలీసులకు చిక్కకుండా సరికొత్త పద్ధతుల్లో గం జాయి విక్రయిస్తున్నారు. ఎండు గంజాయి అమ్మకాలకు బదులుగా సులువుగా రవాణా, అమ్మకాలు జరిపేందుకు వీలుగా గంజాయిని చాకెట్లు, లిక్విడ్ రూపంలో అమ్మకాలు జరుపుతున్నారు. గంజాయి స్మగ్లర్లు ఎండుగంజాయిని వేర్వేరు పద్ధతుల ద్వారా చాకెట్ల రూపంలోకి మార్చుతున్నారు. గం జాయి చాకెట్ల రవాణా, అమ్మకాలు సులభం కావడంతో వ్యాపారులు అమ్మకాలపై ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది. గంజాయి చాకెట్లను ఎక్కువ ధరలకు విద్యార్థులకు, యువతకు అమ్ముతున్నట్లు సమాచారం. ఎండు గంజాయిని ద్రవరూపంలోకి మార్చి లిక్విడ్ గాంజా అమ్ముతున్నారు. దీనిని లిక్విడ్ గంజాయిని ‘హాషిశ్ ఆయిల్’ పిలుస్తున్నారు. చిన్నసైజు బాటిళ్లలో ‘హాషిశ్ ఆయిల్’ను అమ్ముతున్నారు. జిల్లాలో ‘హాషిశ్ ఆయిల్’ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల పటాన్చెరు, సంగారెడ్డిలో పెద్దసంఖ్యలో ఎక్సైజ్ అధికారులు హాషిశ్ ఆయిల్ బాటిళ్లను పట్టుకుని కేసులు నమోదు చేశా రు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలోని పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఎండుగంజాయి అమ్మకాలతోపాటు హాషిశ్ ఆయిల్, గంజాయి చాకెట్ల అమ్మకాలపై దృష్టి పెట్టారు. వీటి అమ్మకాలను అరికట్టేందుకు వ్యూహారచన చేస్తున్నారు.
గంజాయి సాగు చేస్తే రైతుబంథు కట్ ?
రైతులు గంజాయి సాగుచేస్తే ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో రైతులు, కౌలుదారులు గంజాయి మొక్కలను పెంచుతున్నారు. చెరు వు, కంది, పత్తి, జొన్న పంటల్లో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తు న్నా సాగు తగ్గడంలేదు. రైతులు గంజాయి సాగు చేసినట్లు తేలితే రైతుబంధు, రైతుబీమాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే రెవెన్యూ అధికారులకు ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రైతులు, కౌలుదారులు గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిపారు.
ఎన్డీపీఎస్, పీడీ యాక్టులు
గంజాయి రవాణా, అమ్మకాలు జరుపుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ఎక్సైజ్శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. గం జాయి అక్రమ రవాణా, అమ్మకాలు చేస్తున్న వారిపై ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. గం జాయి అమ్మకాలు, సేవిస్తున్న వారిలో కొంతమంది యువకులు, విద్యార్థులు పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నా యి. ఎక్సైజ్ అధికారులతోపాటు ఇకపై పోలీసులు సైతం ఎన్డీపీఎస్ యాక్టు కింద గంజాయి రవాణా, అమ్మకాలు జరిపేవారిపై కేసులు పెట్టే యోచనలో ఉన్నారు. జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలను నిర్మూలనపై తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సంగారెడ్డిలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సమావేశంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు, పోలీసు-ఎక్సైజ్శాఖల మధ్య సమన్వయం, సంయుక్తంగా దాడుల నిర్వహణ, ఇంటలిజెన్స్ తదితర అంశాలపై చర్చించి కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు.