సంగారెడ్డి, అక్టోబరు 23 : గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని అసరా చేసుకుని రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు నిందితులు పట్టుపడ్డ అక్రమ గంజాయి రవాణా అగడంలేదు. శనివారం జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణం సాయి మాణిక్నగర్లో గంజాయితో ముగ్గురు నిందితులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ రఘురామ్ వెల్లడించారు. శుక్రవారం ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారంతో సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో ఓ ఇంటిపై దాడి చేశారు. నర్సాపూర్ మం డలం చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన మంగలి నవీన్ వ్యక్తి దగ్గర 350 గ్రాములు ఎండు గంజాయి దొరికింది. అలాగే, అదేరోజు సాయంత్రం గంజాయి సరఫరా చేసే వ్యక్తి వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం కల్కోడ్ గ్రామానికి చెందిన ఇడిగి వినీత్ కుమార్ దగ్గర 1.150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి మొత్తం కిలోన్నర గంజాయి, బైక్, మోటర్ సైకిల్ను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. కిలోన్నర ఎండు గంజాయి విలువ రూ.15 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించామని అసిస్టెంట్ కమిషనర్ రఘురామ్ వివరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
పటాన్చెరు, అక్టోబర్ 23 : రుద్రారంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని రుద్రారంలో మహారాష్ట్ర సావంగి ప్రాంతానికి చెందిన సంజయ్ శివరాం డోంగ్రే మేస్త్రిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అక్రమంగా గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు, తహసీల్దార్ కలిసి అతడి ఇంట్లో తనిఖీచేశారు. తనిఖీల్లో 10 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఐదు గ్రాముల చొప్పున 50 గ్రాముల గంజాయి దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పటాన్చెరు పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవు
న్యాల్కల్, అక్టోబర్ 23 : మండలంలోని అత్నూర్ గ్రామంలో గంజాయి సాగు, రవాణా చేయొద్దని జహీరాబాద్ రూరల్ సీఐ నాగేశ్వర్రావు రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగుచేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. సాగుచేసిన రైతు భూమికి ప్రభుత్వం పథకాలు రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి రవాణా చేసి పట్టుబడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై వినయ్కుమార్, ఉప తహసీల్దార్ విజయ్ కుమార్, మాజీ జడ్పీ టీసీ శివాజీపాటిల్, మాజీ సర్పంచ్ సంగ్రామ్పాటిల్, రైతులు పాల్గొన్నారు.