శేరిలింగంపల్లి, నవంబర్ 18: సంధ్య కన్వెన్షన్ ఎండీ సర్నాల శ్రీధర్రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం కమర్షియల్ కాంప్లెక్స్కు సంబంధించి ఓ బాధితుడి ఫిర్యాదు అందకున్న పోలీసులు బెంగళూర్లో శ్రీధర్రావును అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకువచ్చి రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బాధితుడు, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…నగరానికి చెందిన రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ రాయదుర్గం పాన్మక్తాలో ఉన్న సర్నాల శ్రీధర్ రావుకు చెందిన సంధ్య టెక్నోవన్ వాణిజ్య భవనంలో 9వ అంతస్తులో మొత్తం 1185 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కొనుగోలు చేసింది.
రూ. 60, 39,500ను చెల్లించి జనవరిలో సేల్డీడ్ డాక్యుమెంట్ చేయించుకున్నారు. శ్రీధర్రావు తరఫున సంధ్య కన్వెన్షన్ సంస్థ ప్రతినిధి సృజన్సేన్ స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ(ఎస్పీఏ) తీసుకుని రిజిష్ట్రర్ చేశారు. అనంతరం ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోగా, భవన ప్రాంగణాన్ని అప్పగించలేదు. దీంతో పాటు రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధులను శ్రీధర్రావు తన కార్యాలయానికి పిలిపించుకొని.. తన భవనం ఐటీకి అటాచ్ ఆయిందని..రెండేండ్ల వరకు కార్యాలయం అప్పగించడం కుదరదని ..రిజిష్ర్టేషన్ ఖర్చుల డబ్బులు వదిలేసుకోవాలని బెదిరించాడు.
కొద్దిరోజులకు ఇన్క్రీడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సదరు 9వ అంతస్తులో మిగతా కార్యాలయాన్ని కొనుగోలు చేసి.. గోడలు, గదులు కూల్చి వేసింది. దీంతో రోవాన్ కంపెనీ అసోసియేట్స్ సంస్థ డైరెక్టర్ చైతన్య కృష్ణ మూర్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీధర్రావుతో పాటు అతడి అనుచరుడు సృజన్సేన్, ఇన్క్రీడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి ప్రవీణ్కుమార్లపై కేసులు నమోదు చేశారు. బెంగళూర్లో ఉన్న శ్రీధర్రావును అరెస్టు చేసి గురువారం రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సృజన్సేన్, ప్రవీణ్కుమార్లు పరారీలో ఉన్నారు.
అదనంగా రూ. 40 లక్షలు డిమాండ్…
మొన్న శ్రీనివాస్ వసమాని, నేడు చైతన్య కృష్ణ మూర్తిలతోపాటు శ్రీధర్రావుపై రాయదుర్గంలో తాజా గా మరో కేసు నమోదైంది. ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ భరత్రెడ్డి, స్నేహశ్రీ దంపతులు ఇదే తరహాలో రాయదుర్గంలోని సంధ్య టెక్నోవన్ వాణిజ్య భవ న సముదాయంలో శ్రీధర్రావు నుంచి 2365 చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణాన్ని రూ. 88,61,250లకు 2018లో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించలేదు. బాధితులు శ్రీధర్రావును నిలదీయగా, అదనంగా మరో రూ. 40 లక్షలు ఇస్తే సదుపాయాలతో పాటు కార్యాలయ ప్రాంగణాన్ని అప్పగిస్తానని చెప్పాడు. దీంతో స్నేహశ్రీ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. మొత్తంగా వివిధ నేరాలపై సర్నాల శ్రీధర్రావుపై పలు పోలీస్స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి.