న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వరంగ స్టీల్ దిగ్గజం సెయిల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,478.82 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడంతో గత త్రైమాసికపు లాభంలో 28 శాతం క్షీణత నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,469.88 కోట్ల లాభాన్ని గడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.23,533.19 కోట్ల నుంచి రూ.31,175.25 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.18,829.26 కోట్ల నుంచి రూ.28,005.28 కోట్లకు పెరిగాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.2.25 తుది డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది. జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ 4.60 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేయగా, 4.71 మిలియన్ టన్నుల స్టీల్ను విక్రయించింది.