సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
అమీర్పేట్, మార్చి 27: తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువచేసి మాట్లాడితే ఇక్కడి కవులు, రచయితలు సహించరని, తిరగబడతారని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భజలాల పరిరక్షణ కోసం జలమండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంయుక్తంగా ఆదివారం సనత్నగర్ సెయింట్ థెరిస్సా స్కూల్లో 300 మంది కవులతో నిర్వహించిన సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ.. ఆత్మగౌరవంతో తనను తాను పునర్నిర్మించుకొంటూ ముందుకు సాగుతున్నదని వెల్లడించారు. ఒకనాడు జలాల కోసం పోరాడిన కవులు, రచయితలు నేడు జలసంరక్షణలో తమవంతు చారిత్రక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, చీఫ్ అడ్వైజర్ ఎంవీ గోనారెడ్డి, జలమండలి ఓఎస్డీ సత్యనారాయణ, కేజీ టు పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు గింజల రమణారెడ్డి, కవి సమ్మేళన నిర్వహణ ప్రతినిధులు గోపాల్జీ, డాక్టర్ యానాల ప్రభాకర్రెడ్డి, డాక్టర్ మైనేని వాణి, పీ గిరిధర్గౌడ్, ఎండీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.