శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోకకల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం విశేష కార్యక్రమైన సహస్ర దీపాలంకరణ సేవను ఈఓ కేఎస్ రామారావు దంపతులు నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకార మండపంలో కుడివైపున ఉన్న పునరాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు ఏకాంతంగా దీపార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీపై ఉంచి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. త్రయోదశి తిథి సందర్భంగా సోమవారం దేవస్థానం ఆధ్వర్యంలో శనగల బసవన్నకు విశేష పూజలు నిర్వహించారు. పరోక్ష సేవ ద్వారా భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ప్యాకెట్లను ఆలయ అధికారులు అందించారు.