హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఐక్యరాజ్య సమితి అనుబంధ వ్యవసాయ విభాగం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ అనిశెట్టి మూర్తి అన్నారు. హనుమకొండకు చెందిన మూర్తి ఇటలీ రాజధాని రోమ్లోని ఎఫ్ఏవో ప్రధాన కార్యాలయంలో 26 ఏండ్లపాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. రైతుబంధు, ఇతర వ్యవసాయ అంశాలపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలు పంచుకొన్నారు.
ఇలాంటి పథకం వస్తే బాగుండని అనుకొనేవాళ్లం
నేను ఎఫ్ఏవోలో సీడ్ సెక్టార్లో పనిచేసే సమయంలో అనేక దేశాలకు వెళ్లేవాడిని. రైతులు పంట పెట్టుబడి కోసం పడుతున్న ఇబ్బందులను దగ్గరినుంచి గమనించేవాళ్లం. అక్కడి ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి ఖర్చు (ఇన్పుట్ కాస్ట్) ఇవ్వగలిగితే బాగుండు అని అనుకొనేవాళ్లం. దీనిపై చాలాసార్లు చర్చించుకొన్నాం. ఇప్పుడు రైతుబంధు పథకం రూపంలో తెలంగాణలో అది సాధ్యమైంది.
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా రైతుబంధు
రైతుబంధు ఆశామాషీ పథకం కాదు. ఇది ప్రపంచ దేశాలకు ఆదర్శమైనది. భారత్లాంటి దేశాల్లో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ఊరటనిస్తున్నది. సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చు భారం సగం తగ్గుతుంది. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పైసలతో సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవచ్చు. ఇలాంటి పథకం అన్ని దేశాల్లో అమలైతే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. వ్యవసాయరంగం దశ, దిశను పూర్తిగా మార్చే శక్తి రైతుబంధు పథకానికి ఉన్నది.
సీఎం కేసీఆర్ ఆ ధైర్యం చేశారు
సాగు పెట్టుబడి ఖర్చు రైతులకు నేరుగా ఇవ్వడం సాధారణ అంశం కాదు. మేము ఈ అంశంపై సూచనలు చేసినప్పుడు కొన్ని దేశాలు సానుకూలంగా స్పందించాయి. కానీ వారికి సాధ్యం కాలేదు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో రైతుబంధు పేరుతో అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో రైతులకు పెట్టుబడి ఖర్చు ఇచ్చే పథకాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రపంచ స్థాయి నేతలకే రాని ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు వచ్చింది. ఆలోచన రావడమే కాదు, ధైర్యంగా ముందడుగు వేసి పథకాన్ని అమలు చేశారు. రైతుల కోసం, వ్యవసాయరంగం కోసం ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుంది.
ఇతర దేశాలవాళ్లు మెచ్చుకొంటున్నరు
తెలంగాణలో రైతుబంధు రూపంలో పెట్టుబడి ఖర్చు ఇస్తున్న విషయాన్ని తెలుసుకున్న విదేశాల్లోని చాలామంది, గతంలో ఎఫ్ఏవోలో విధులు నిర్వహించినవారు నాకు ఫోన్చేసి ఈ పథకంపై ఆరా తీశారు. పథకం బాగున్నదని మెచ్చుకొన్నారు. మా ఆలోచనలకు తగిన పథకం వచ్చిందని సంతోషపడ్డారు. ఈ పథకం మాదిరిగా వాళ్ల దేశాల్లోనూ అమలుచేసేందుకు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రైతులు ఆనందంగా ఉన్నారు
నా స్వస్థలం హనుమకొండ. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న. నేను కూడా రైతునే. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఊరికి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నా. ఆ సమయంలో రైతులు రైతుబంధు గురించి మాట్లాడుకోవడం గమనించాను. దీనిపై రైతుల్లో మంచి అభిప్రాయం ఉన్నది. వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏటా రెండుసార్లు ఇవ్వడం మంచి నిర్ణయం. ఒక్క పథకం కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయడమంటే సాధారణ విషయం కాదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిచాల్సిందే. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కన్నా రైతుబంధు ఎంతో బాగున్నది.
రైతుబంధు పథకాన్ని గుర్తించిన ఎఫ్ఏవో
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి అమలవుతున్న ప్రధాన అంశాలను, పథకాలను ఎఫ్ఏవో ప్రత్యేకంగా గుర్తించి అన్ని దేశాలకు తెలియజేస్తున్నది. 2018 నవంబర్లో రైతుబంధును ప్రత్యేకంగా గుర్తించింది. ఇలాంటి పథకాన్ని ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేయడంపై తెలంగాణను ప్రశంసించింది. రోమ్లోని ప్రధాన కార్యాలయంలో రైతుబంధు గురించి వివరిస్తూ ప్రత్యేక డాష్బోర్డ్ను ఏర్పాటుచేసింది. అది ఇప్పటికీ ఉన్నది. రైతుబంధు వ్యవసాయరంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కితాబిచ్చింది. తెలంగాణ విత్తన భాండాగారమని ఇటీవలే ఎఫ్ఏవో ప్రశంసించింది. గతంలో రాష్ట్రంలో ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించింది.