హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం మంచిదంటూ తన గానంతో కీర్తించిన కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. తన కూతురు వివాహానికి రెండు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొన్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకొన్న విషయం విదితమే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు టీఎస్ఆర్టీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఆర్టీసీ గురించి సానుకూల ప్రచారం చేసినందుకుగాను ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు బుధవారం బస్భవన్లో మొగులయ్యను శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు.