డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో 19 ఏళ్ల అంకితా భండారీ మరణం ఇటీవల సంచలనం రేపింది. అయితే ఆ యువతి మృతికి ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి కారణమంటూ ఆర్ఎస్ఎస్ సభ్యుడు విపిన్ ఆరోపించాడు. అంకితా విషాద మరణంలో ఆమె తండ్రి పెద్ద దోషి అని విమర్శించాడు. అటవీ ప్రాంతంలోని రిసార్టులో, పైగా వ్యభిచారం జరిగే చోట తన కుమార్తెను ఆమె తండ్రి పనికి పంపాడని ఆరోపించాడు. ఇది ‘మగ పిల్లుల ముందు పాలు ఉంచడం’ వంటిదంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
అయితే దీనిపై విమర్శలు రావడంతో విపిన్ వెంటనే ఆ ఫేస్బుక్ పోస్ట్ను తొలగించాడు. కాగా, సోషల్ మీడియాలో విపిన్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ ఖండించినట్లు ప్రచార్ ప్రముఖ్ సంజయ్ తెలిపారు. అతడు కూడా దీనికి క్షమాపణలు చెప్పాడని అన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్త విపిన్ వివాదస్పద పోస్ట్పై కేసు నమోదు చేసినట్లు డెహ్రాడూన్ పోలీసులు బుధవారం తెలిపారు.