Swadeshi Jagaran Manch on Crypto | క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల విషయమై ఆరెస్సెస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రిప్టో కరెన్సీల్లో ట్రాన్సాక్షన్స్ మీద నియంత్రణ తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాటిల్లో పెట్టే పెట్టుబడులను పూర్తిగా గుర్తించాలని ఎస్జేఎం కో కన్వీనర్ అశ్వినీ మహాజన్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా, ఎవరైనా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్నదని గుర్తు చేశారు.
దేశంలో ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని నియంత్రించడం లేదని, ప్రైవేట్ ఎక్స్చేంజ్ల ఆధీనంలో క్రిప్టో ట్రేడింగ్, లావాదేవీలు సాగుతున్నాయని అశ్వినీ మహాజన్ పేర్కొన్నారు. ఇక క్రిప్టో కరెన్సీల మైనింగ్, నిర్వహణ, లావాదేవీల డేటా దేశీయంగా ఏర్పాటు చేసిన సర్వర్లలోనే స్టోర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తత్ఫలితంగా చట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాలను గుర్తించడానికి ప్రభుత్వానికి వీలు చిక్కుతుందన్నారు. క్రిప్టో కరెన్సీని డబ్బుగా గానీ, మారక ద్రవ్యంగా గానీ గుర్తించలేమన్నారు.