హైదరాబాద్, జూలై 3 (నమస్తేతెలంగాణ) : గురుకుల టెండర్లకు సంబంధించి పార్క్హయత్ హోటల్లోనే కమీషన్ల పంపకాలు జరిగాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ నేతలను అనుమతిస్తే మంత్రుల బండారం బయటపడేదంటూ తేల్చిచెప్పారు. సీఎం వద్ద మార్కులు కొట్టేసేందుకే ప్రెస్క్లబ్లో మంత్రులు డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. గన్పార్క్కు రాకుండా తమను అరెస్ట్ చేయించిన మంత్రులు ఇప్పుడు పరువు కోసం ప్రగల్భాలు పలుకుతున్నారని దెప్పిపొడిచారు. మొన్న గన్పార్క్కు ఇంటెలిజెన్స్ పోలీసులను వెంట పెట్టుకొని వచ్చింది నిజం కాదా?
మంత్రులే ఇంటెలిజెన్స్ డీజీపీకి చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కంచ్న్బాగ్ ఠాణాలో మంత్రుల కోసం కుర్చీలు వేసి ఎదురుచూసినా ఎందుకు రాలేదని నిలదీశారు. ‘గురుకుల టెండర్లలో కేంద్రీకృత విధానం కోసం తెచ్చిన జీవో 17 రద్దుచేసేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై తెలంగాణ భవన్కు వస్తానని తొడగొట్టి తోకముడిచిన జూపల్లి కృష్ణారావు నిన్న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మూడు కుర్చీలు వేసుకొని కూర్చోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. జూపల్లికి చేసేందుకు పని లేక.. ఆయన శాఖలో ఏం జరుగుతున్నదో తెలియక గాలికి తిరుగుతూ.. గాలి మాటలు మాట్లాడుతున్నరు..’అంటూ విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు గురుకుల టెండర్లు ఇవ్వాలని హరీశ్రావు డిమాండ్ చేయడాన్ని మంత్రులు తప్పుపట్టడమేంటని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీశారు. తెలంగాణ బిడ్డలకు అండగా నిలువాలని కోరితే మంత్రులెందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థంకావడంలేదని మండిపడ్డారు. మఫత్లాల్, చింతామణి కంపెనీలిచ్చే కమీషన్లలో ముఖ్యమంత్రితో పాటు మీకు వాటాలున్నాయా? అని నిలదీశారు. ‘పొన్నం ప్రభాకర్..నాకు తాడు బొంగరం లేదంటున్నవ్..సరే మరీ నీకు ఉన్నాయిగా..జీవో 17 నోట్ఫైల్లో సంతకం చేశారా? లేదా? చెప్పండి.. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అంశం మీకు తెలుసా? తెలియదా? మంత్రులు అడ్లూరి, అజారుద్దీన్కు అవగాహన ఉన్నదా? లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అయినా పీఎంయూ కావాలని అడిగిందెవరు.. విద్యార్థులా? వారి తల్లిదండ్రులా, కేంద్ర ప్రభుత్వమా? ఆ శాఖల సెక్రటరీలా అని నిలదీశారు.
రేవంత్రెడ్డి, వేంనరేందర్, జయవీర్రెడ్డి కోసమే జీవో 17 తెచ్చారని ఆర్ఎస్పీ ఆరోపించారు. తాను తప్పు మాట్లాడితే జైలుకు పంపాలని, అంతేగానీ పేదబిడ్డలకు మాత్రం అన్యాయం చేయొద్దని హితవుపలికారు. మీరు రెండేండ్ల మంత్రులు కావచ్చు..కానీ తొమ్మిదేండ్లు గురుకుల సెక్రటరీగా పనిచేశాననే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ‘విద్యార్థులు మఫత్లాల్ బట్టలు వేసుకోవద్దా? అని అడ్లూరి లక్ష్మణ్ అంటున్నరు..ఇంతకాలం పిల్లలు ఏ బట్టలు వేసుకొని డాక్టర్లు, ఇంజినీర్లు అయి విదేశాలకు వెళ్లారు? ఏ దుస్తులు ధరించి ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించారు’ అని ప్రశ్నించారు.