న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో రూ.18,000 కోట్లు తిరిగి వసూలయ్యాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విస్తృత అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై పైవివరాలను అందించారు. దేశంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన 4,700 కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్నదని, కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న ఈ నేరాల మొత్తం విలువ రూ.67,000 కోట్లు అన్నారు. అయితే ఆయా కేసుల్లో కోర్టుల ఆదేశాలే రికవరీకి అడ్డంకిగా మారాయని మెహతా గుర్తుచేశారు. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయలు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన అక్రమార్కులు కోర్టుల నుంచే రక్షణ పొందుతున్నారని చెప్పారు. కాగా, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులు పీఎంఎల్ఏకు ఇటీవల చేసిన సవరణలు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీం కోర్టుకు గతకొద్ది వారాలుగా విన్నవిస్తున్నారు. కఠినమైన బెయిల్ షరతులు, అరెస్టులకు సంబంధించి సమాచార లోపం, ఈసీఐఆర్ ఇవ్వకుండానే అరెస్టులు చేయడం వంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఆయా దేశాలతో పోల్చితే భారత్లో ఈడీ నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువని మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు. ఏటా బ్రిటన్లో పీఎంఎల్ఏ కింద 7,900 కేసులు నమోదవుతున్నాయని, అమెరికాలో 1,532, చైనాలో 4,691, ఆస్ట్రియాలో 1,036, హాంకాంగ్లో 1,823, బెల్జియంలో 1,862, రష్యాలో 2,764 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కానీ ఐదేండ్ల (2015-16 నుంచి 2020-21)లో ఈడీ నమోదు చేసిన కేసులు 2,086 మాత్రమేనని మెహతా తెలియజేశారు. నిజానికి ఈ ఐదేండ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు.