‘ఆర్ఆర్ఆర్’ ప్రచారపర్వం షురూ
‘జనని’ గీతం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని సమస్త ఉద్వేగాలు, సన్నివేశాలకు ఓ ఆత్మలా భాసిల్లుతుందని చెప్పారు దర్శకుడు యస్.యస్.రాజమౌళి. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సినీప్రియులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రచార పర్వానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సినిమాలో దేశభక్తి ప్రధానంగా సాగే ‘జనని ప్రియ భారత జనని’ గీతాన్ని నేడు విడుదల చేయబోతున్నారు. ఈ పాటను గురువారం మీడియా వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రోమాంచితమైన పోరాటఘట్టాలు, హీరోల ఉపోద్ఘాత సన్నివేశాలు, ఉరకలెత్తించే పతాక సన్నివేశాలు..ఈ అంశాలన్నింటిని అంతర్లీనంగా ఓ భావోద్వేగం నడిపిస్తుంటుంది. ‘నాటు నాటు’ వంటి ఊరమాస్ పాటలో కూడా కనిపించని ఎమోషన్ దాగి ఉంటుంది. మణిహారంలోని దారంలా ఈ సమస్త ఉద్వేగాలన్నింటికి ‘జనని’ గీతం ఓ ఆత్మలా కనిపిస్తుంది. సున్నితమైన మెలోడీగా సాగే ఈ పాట సినిమా కథకు ఆయువుపట్టులా ఉంటుంది. కీరవాణి అన్నయ్య ఈ పాట కోసం రెండు నెలలు శ్రమించారు. తెలుగులో తానే సాహిత్యం సమకూర్చారు. మీరు కూడా ఈ పాటను చూసి ఆస్వాదించండి’ అన్నారు.
త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్
డిసెంబర్ మొదటివారంలో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ను విడుదల చేయబోతున్నామని, ప్రచార కార్యక్రమాల్ని కూడా ఉధృతం చేస్తామని రాజమౌళి తెలిపారు. ‘సినిమా ప్రమోషన్స్ కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే నెల నుంచి రెండుమూడు ప్రీరిలీజ్ ఈవెంట్స్కు ఏర్పాట్లు చేస్తున్నాం. నటీనటులతో పాటు సినిమా టీమ్ అంతా మీ ముందుకే రాబోతున్నది. మున్ముందు ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశాల్లో మీ ప్రశ్నలన్నింటికి మా టీమ్ సమాధానాలిస్తుంది’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు చారిత్రక కథకు కాల్పనిక అంశాల్ని జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో కొమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటించారు. ఒలీవియా మోరీస్, అలియాభట్ కథానాయికలు. కీరవాణి స్వరాల్ని సమకూర్చారు.