రాత్రి పది గంటలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్లాట్ ఫామ్ నంబర్ వన్.. కుర్తా పైజమాలో ఓ అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఒక పోకిరి వెనుక నుంచి వచ్చి ఆమె భుజానికి భుజం తాకిస్తూ.. ఆబగా శరీరాన్ని తడిమేసి వేగంగా కదిలాడు. అంతే వేగంగా ఆ యువతి రెండు పీకింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే.. గల్లాపట్టి గుంజి యూనిఫామ్లో ఉన్న రైల్వే పోలీసులకు అప్పగించింది. రెండు నెలల కిందట మొదలైన ‘శక్తి’ టీమ్ అండర్ కవర్ ఆపరేషన్ ఇది. రైల్వే స్టేషన్లలో మహిళలకు భద్రత కల్పించడంలో ఈ బృందం చురుకైన పాత్ర పోషిస్తున్నది.
రైలు ప్రయాణాలు చాలా ఇరుకు. చేతినిండా లగేజ్. ఎవరి హడావుడి వాళ్లది. ఈ సందడిని సాకుగా చేసుకుని ఆడవాళ్లను తాకేవారు, గిల్లేవారు, ఎదురు సీట్లో కూర్చొని కళ్లలోకి కళ్లు పెట్టి చూసేవారు, చిల్లర దొంగలు, వ్యభిచార ముఠాల సభ్యులు.. ఇలా అడుగడుగునా ఇబ్బందులే. ఈ లైంగిక హింసను కట్టడి చేయాలని భావించింది దక్షిణ మధ్య రైల్వే. ఆ ప్రయత్నంలో శక్తి టీమ్లను రంగంలోకి దించింది. కాజీపేట రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్) పరిధిలో నాగమ్మ శక్తి పేరుతో, సికింద్రాబాద్ పరిధిలో రుద్రమ్మ శక్తి పేరుతో, వరంగల్ పరిధిలో భద్రకాళి శక్తి పేరుతో.. ఈ బృందాలు పనిచేస్తున్నాయి. గతంతో పోలిస్తే మహిళా ప్రయాణికుల్లోనూ చైతన్యం వచ్చింది. ఒకప్పటిలా ‘మనకెందుకు’ అని నిర్లిప్తంగా ఉండటం లేదు. నలుగురూ పోగవుతారని భయపడటం లేదు. హింసను భరించడం లేదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా.. సెల్ఫోన్తో ఓ ఫొటో తీసి ‘శక్తి’ టీమ్కు వాట్సాప్ చేస్తున్నారు. ఇంకేముంది, తదుపరి స్టేషన్లో యూనిఫామ్లో ఉన్న పోలీసులు రంగంలోకి దిగుతారు. చొక్కా పట్టుకుని రోమియోలను స్టేషన్కు లాక్కెళ్తారు.
లేడీ పోలీస్తో పెట్టుకోకు
‘శక్తి’ బృందంలో కానిస్టేబుల్ నుంచి వివిధ హోదాల పోలీసు సిబ్బంది ఉంటారు. చాలా సందర్భాల్లో వాళ్లు యూనిఫామ్ వేసుకోరు. కుర్తా పైజమా ధరించి, భుజానికి బ్యాగు తగిలించుకుని, చేతిలో సెల్ఫోన్తో సాధారణ ప్రయాణికుల్లా రైల్వే స్టేషన్లో తిరుగుతుంటారు. కొన్నిసార్లు పట్టుచీరలతోనో, బురఖాతోనో ప్రత్యక్షం అవుతారు. పోకిరి వ్యవహారాల్ని పసిగట్టి.. బ్యాగులోని లాఠీ తీసి నాలుగు వాయిస్తారు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే కూడా సిద్ధంగా ఉంటుంది. సెల్ఫోన్ దొంగలు, పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్లకు గాలం వేసేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతారు. ధగధగా మెరిసే రోల్డ్ గోల్డ్ నగలు ధరిస్తారు. బ్యాగ్ పక్కన పెట్టి కునుకు తీస్తున్నట్టు నటిస్తారు. ఆ విషయం తెలియని ముఠాలు వలలో పడిపోతాయి. చేసిన నేరాలకు ఊచలు లెక్కబెడతాయి. ఈ మధ్యే, ఇటుక బట్టీలలో పనిచేయించడానికి ఒడిశా నుంచి తీసుకొచ్చిన బాల కార్మికులను గుర్తించి.. స్వస్థలాలకు పంపిందీ బృందం. వాళ్లంతా ఇప్పుడు బుద్ధిగా బడికెళ్లి చదువుకుంటున్నారు.
ఇలా పసిగడతారు
‘మా టీమ్ మొత్తం ఒకే ట్రైన్ ఎక్కుతుంది. ఇద్దరిద్దరు చొప్పున మూడు బోగీలు ఎక్కుతాం. రద్దీగా ఉండే రైళ్లనే ఎంచుకుంటాం. అందులోనే దొంగలు, ఈవ్టీజర్లు ఎక్కువగా ఉంటారు. కాలేజీ రోజుల్లో ఎదుటి మనిషికి ఎదురు చెప్పడమే రాని మమ్మల్ని మహిళలకు భద్రతగా నిలిచేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తీర్చిదిద్దింది. ఖాకీ యూనిఫామ్ కొండంత ధైర్యాన్నిచ్చింది’ అంటారు రుద్రమ్మ శక్తి సబ్ ఇన్స్పెక్టర్ ప్రజ్ఞ. “ఒకసారి ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా కూర్చున్న అమ్మాయి దగ్గరికి ఒకఆకతాయి వచ్చాడు. ‘ఎక్కడి నుంచి వచ్చావు? నేనేమైనా హెల్ప్ చేయనా?’ అంటూ మాటలు కలిపాడు. ‘వేరే పనేం లేదా? నీ పని నువ్వు చూసుకో’ అంటూ అమ్మాయి గుడ్లురిమింది. ఆ తర్వాత అతను మరో యువతి పక్కన చేరాడు. అక్కడా అవే కబుర్లు. అతని ప్రవర్తనను చాలా చేపు గమనించాను. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో అదుపులోకి తీసుకున్నాం. కౌన్సెలింగ్ చేసి పంపాం’ అంటూ ఓ సంఘటనను పంచుకున్నారు కానిస్టేబుల్ జ్యోతి ఎస్. కరాళే. రుద్రమ్మ టీమ్ కరడుగట్టిన నేరగాళ్లనూ పట్టుకుంటున్నది. కానిస్టేబుల్ హేమలత డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. ‘ఒకతను నిద్రపోతున్నాడు. అతని పక్కనే బ్యాగ్ ఉంది. ఓ వ్యక్తి వచ్చి పక్కనే కూర్చుని అటు ఇటూ కదిపాడు. అయినా, నిద్రపోతున్న వ్యక్తి లేవలేదు. అంతే, చిన్నగా ఆ బ్యాగు తీసుకుని వెళ్లబోయాడు. నేను, మరో కానిస్టేబుల్ భారతి ఆ సమయంలో పహరా కాస్తున్నాం. అనుమానం వచ్చి మేడమ్కు సమాచారం ఇచ్చాం. యూనిఫాంలో ఉన్న పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ పరిశీలిస్తే.. అతని నేరచరిత్ర మొత్తం బయటపడింది. గతంలోనూ అనేక చోరీలు చేశాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు’ అని వివరిస్తారామె.
ప్రజా భాగస్వామ్యం
‘శక్తి’ కార్యక్రమంలో ప్రయాణికులనూ భాగస్వాములను చేస్తున్నారు. తరచూ ఆ మార్గంలో ప్రయాణించే నూటయాభై మంది మహిళా ప్యాసింజర్లతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే.. వెంటనే సెల్ఫోన్తో ఫొటో తీసి శక్తి టీమ్కు వాట్సాప్ చేస్తారు వాళ్లు. క్షణాల్లో పోలీసులు రంగంలో దిగుతారు. బాలికలు, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడమూ శక్తి టీమ్ బాధ్యతే. ఉమెన్ ట్రాఫికింగ్ను పసిగట్టడంలో యాంటీ క్రైమ్ టీమ్తో పోలిస్తే.. శక్తి టీమ్ మరింత విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. శక్తి టీమ్ల ఏర్పాటు తర్వాత.. సికింద్రాబాద్ డివిజన్లో దొంగలు, చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్స్పై 30 శాతం కేసులు పెరిగాయి. ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నవే. ‘రైల్వే స్టేషన్లో కాలుపెట్టింది మొదలు.. సురక్షితంగా గమ్యానికి చేరే వరకూ మహిళా ప్రయాణికుల బాధ్యత మాదే’ అంటున్నారు రుద్రమ్మ ప్రతినిధులైన ఈ పోలీసమ్మలు!
మహిళా శక్తిని చాటుతున్నాం..
మహిళా ప్రయాణికుల భద్రతకు సంబంధించి గత సెప్టెంబరులో ఒక సర్వే నిర్వహించాం. మహిళా పోలీసులైతే సమస్యల్ని బాగా అర్థం చేసుకుంటారని, జంకు లేకుండా ఫిర్యాదు చేయగలమనీ ఎక్కువమంది ప్రయాణికులు చెప్పారు. దీంతో, వివిధ ప్రాంతాల్లో పనిచేసే మహిళా సిబ్బందితో శక్తి బృందాలు రూపొందించాం. రైలు ప్రయాణంలో మహిళల ఇబ్బందులను గుర్తించడం, తక్షణ చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. 139 టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమస్యల్ని చెప్పినా.. శక్తి టీమ్ను అలర్ట్ చేస్తాం.
– దేబస్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ
సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్,
సికింద్రాబాద్ డివిజన్ (ఆర్.పి.ఎఫ్.)
– నాగవర్ధన్ రాయల