హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్స్ను ఒకటి నుంచే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఉద్యోగులకు, కొత్త ఉద్యోగులకు రోస్టర్ ఎలా ఉండాలన్నదానిపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పాటించిన విధంగానే రోస్టర్ పాయింట్స్ను అమలు చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే కొత్త విధానం తీసుకొస్తే ఎలా ఉంటుంది? అన్నదానిపై చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లోనే విభజన జరిగింది. ఏపీకి వెళ్లగా తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులకు ఒకటి నుంచి రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. జిల్లాల విభజనతో ఇప్పుడు 33 జిల్లాలు వచ్చాయి. నూతన జోనల్ విధానం కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తంగా 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులను పూర్తి చేసి ఖాళీలను గుర్తించింది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? ఆ పోస్టుల్లో ఉన్న రిజర్వేషన్లను నిర్ధారించింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటానికి ముందే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్పాయింట్లు నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో కొత్త నియామకాలకు రోస్టర్ పాయింట్స్ను ఒకటి నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
పాత జిల్లాలకు ఉన్న రోస్టర్ పాయింట్స్ అలాగే కొనసాగుతాయని, కొత్త జిల్లాలకు, జోన్లు, మల్టీ జోన్లకు కొత్త రోస్టర్ పాయింట్స్ మొదలవుతాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోస్టర్ పాయింట్ 100తో సర్కిల్ అవుతుందని, ఆ తరువాత 100/1 నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఉన్న ఉద్యోగులను ఆ రోస్టర్ పాయింట్లలో కూర్చోబెట్టి, కొత్త వారిని కంటిన్యూ చేస్తారని అంటున్నారు. ఎక్కడా రిజర్వేషన్లకు ఇబ్బందులు రాకుండా, పదోన్నతులకు లైన్ క్లియర్గా ఉండేలా రోస్టర్ పాయింట్స్ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. త్వరలో రోస్టర్ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు
1 పాత జిల్లాలకు పాత రోస్టర్ పాయింట్స్
2. కొత్త కొత్త జిల్లాలకు కొత్త రోస్టర్
3. రాష్ట్ర విభజన సమయంలో అనుసరించిన విధానం
4. నూతన జోనల్ విధానంలో కేటాయింపులు పూర్తయిన ఉద్యోగులకు రోస్టర్ పాయింట్స్ కేటాయించి, అక్కడినుంచే మొదలు పెట్టడం.