Robert Vadra | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priynaka Gandhi) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
కాగా, రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi) స్థానం నుంచి పోటీ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్కడ ఇటీవలే వాద్రా పోస్టర్లు కూడా వెలిశాయి. ‘అమేథి ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను కోరుకుంటున్నారు’ అంటూ స్థానికంగా ఉన్న పార్టీ కార్యాలయం సమీపంలో పోస్టర్లు కనిపించడం చర్చకు దారి తీసింది. దీంతో అమేథిలో వాద్రా పోటీ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తనకు విజ్ఞప్తులు కూడా అందుతున్నాయని వెల్లడించారు.
ఇదే సమయంలో అమేథి సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇరానీ తన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వదిలించుకోవాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న కృషిని దేశ ప్రజలు గుర్తించారు. అందుకే ప్రజలంతా గాంధీ కుటుంబంతోనే ఉన్నారు. అమేథి నియోజకవర్గ ప్రజలతో నాకు 1999 నుంచి అనుబంధం ఉంది. అప్పటి నుంచి కాంగ్రెస్ తరఫున నేను ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అమేథి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు’ అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల గురించి మీడియా రాబర్ట్ వాద్రాను ప్రశ్నించగా.. ఆయా నియోజకవర్గాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.
మరోవైపు అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. ఈ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్ 30వ తేదీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరిగింది.
Also Read..
Harish Rao | గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టింది గులాబీ జెండానే: హరీశ్ రావు
Red Sea | ఎర్ర సముద్రంలో చమురు ట్యాంకర్ నౌకపై హౌతీల దాడి
Manipur Attack: మణిపూర్లో మిలిటెంట్ల అటాక్.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి