సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : పెరుగుతున్న అవసరాలతోపాటు వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు ఇంట్లో రెండు నుంచి మూడు వాహనాలు కనిపిస్తున్నాయి. కొందరు స్వతహాగా, మరికొందరు శిక్షణ ద్వారా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అయితే 80 శాతం మందికి రోడ్డుపై ఉండే వాతావరణం అనుగుణంగా వాహనాలను నడిపించడం తెలియదు. ఫలితంగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని ఓ మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను, యాక్సిడెంట్లను నివారించేందుకు 15 ఏండ్లపాటు సుదీర్ఘ పరిశీలన చేస్తున్నారు.
ఇలా ఆయన దేశవ్యాప్తంగా దాదాపు 75 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో 400 రోడ్డు ప్రమాదాలను విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా అతివేగం, అవగాహలేమి ప్రధాన కారణంగా తన నివేదికల రూపంలో తేల్చారు. వీటికితోడు రోడ్డు ఇంజినీరింగ్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో నిర్లక్ష్యం, వాహనదారులు హిడెన్ డ్రైవింగ్ వంటి అంశాలు కూడా ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ అధ్యయనంతో మాజీ ఎయిర్ఫోర్స్ అధికారికి సుప్రీంకోర్టు నియమించిన ‘కమిటీ ఆఫ్ రోడ్డు సేఫ్టీ’ సభ్యుడిగా అవకాశం దక్కింది. తాజాగా హైదరాబాద్కు చెందిన ఈ మాజీ సైనికాధికారి సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ పై నాలుగు రాష్ర్టాల్లో అధ్యయనం చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కుటుంబం నుంచే తొలిఅడుగు పడాలని రోడ్డు భద్రత నిపుణుడు ధీరేంద్ర సమ్మినేని సూచించారు.
అంతర్జాతీయ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మనిషి ప్రాణం ముఖ్యం. వాహనం నిర్ధేశిత వేగంతో వెళ్లినప్పుడు అకస్మాతుగా పశువులు, వీధికుక్కలు, ఇతర జంతువులు వచ్చినప్పుడు వాటిని తప్పించేందుకు చాలామంది సడన్గా లేన్ను మార్చేస్తారు. దీంతో వెనకాల వస్తున్న వాహనదారుడితోపాటు, పక్కన వెళ్లే వాహనదారుడికి తీవ్ర ప్రమాదం ఏర్పాడుతుంది. ఇలా పశువులను తప్పించేందుకు చేసే లేన్ మార్పిడితో కొన్ని ఘటనల్లో ఒకేసారి 10 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఉప్పల్ శివారు కొర్రెముల వద్ద ఓ యువకుడు కుక్క అడ్డం వచ్చిందని అకస్మాతుగా కారును లేన్ మార్చడంతో బోల్తాకొట్టి ఒకరు మృత్యువాతపడ్డారు. మరోవైపు రోడ్లకు అంచున చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలు, భోజన పదార్థాలను పారేయడంతో పశువులు, కుక్కలు, పందులు రోడ్లపైకి వస్తాయని ధీరేంద్ర సమ్మినేని విశ్లేషణలో తేలింది. పశువులు, జంతువులు అడ్డం రాగానే వాహనదారుడిలో భయం నెలకొని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తేలింది. ఈ భయాన్ని ‘సినోఫోబియా’ అంటారు.
చాలామంది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ కుమారులు, కుమార్తెలు, సోదరులు, సోదరీమణులకు వాహనాలు ఇప్పిస్తున్నారు. కానీ వారికి రోడ్లపై ఉండే వాతావరణానికి తగినట్లు వాహనాలను ఎలా నడిపించాలో చెప్పడం లేదు. దీంతో చాలా మంది రోడ్లపైకి రాగానే కనిపించే ట్రాఫిక్తో ఒకసారిగా గందరగోళానికి గురవుతున్నారు. ఈ అయోమయంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికితోడు కొత్త వాహనాలు కావడంతో వాటి వేగం అధికం. ఆ స్పీడ్ థ్రిల్ను ఎంజాయ్ చేయడానికి చాలామంది వేగాన్ని పెంచుతున్నారు. ఆ సందర్భంలో రోడ్లపై ఆకస్మిక మలుపులు, గుంతలు, హెచ్చుతగ్గులు, లేన్ మార్చే సమయంలో ఉపయోగించాల్సిన ఇండికేటర్లు, అకస్మాతుగా ముందు వాహనదారుడు బ్రేక్ వేసినప్పుడు పాటించాల్సిన అప్రమత్తం గురించి తెలియకపోవడంతో భయంకర యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలను ఇప్పించే సమయంలో రోడ్లపై ఉండే వాతావరణం గురించి చెప్పాలి.
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా, ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకుంటున్నా..చాలామంది వాహనదారులు హిడెన్ డ్రైవింగ్ను చేసేస్తున్నారు. హిడెన్ డ్రైవింగ్లో సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రెస్ట్లెస్(విశ్రామం లేకుండా నిరంతర డ్రైవింగ్) డ్రైవింగ్, అనారోగ్యంతో ఉన్నా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
మల్కాజిగిరికి చెందిన ధీరేంద్ర సమ్మినేని ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పదవీవిరమణ చేశారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో తీవ్ర కలత చెందిన ఆయన 15 ఏండ్లుగా రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేసి ఆ యాక్సిడెంట్కు కారణాలపై ఓ నివేదికను రూపొందిస్తున్నారు. అందులో జరిగిన లోపాలను సంబంధిత కుటుంబానికి వివరించడంతోపాటు ఆయా శాఖలకు కూడా పంపిస్తున్నారు. ఇలా 15 ఏండ్లలో దాదాపు 400 ప్రమాదాలను విశ్లేషించారు. ధీరేంద్ర చేసిన అధ్యయనాలతో సుప్రీం కోర్టు ‘కమిటీ ఆఫ్ రోడ్డు సేఫ్టీ’ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఆయన హిమాచల్ప్రదేశ్, చత్తీస్గఢ్, అస్సొం, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో రోడ్డు భద్రత పెంచడం, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలను పరిశీలించనున్నారు. ఈ అవకాశం రావడంపై ధీరేంద్ర సమ్మినేని ఆనందం వ్యక్తం చేశారు.
ధీరేంద్ర సమ్మినేని గురించి తెలుసుకున్న ఆదిబట్ల టీసీఎస్ యాజమాన్యం..తమ ఉద్యోగులు, సంస్థలో ఉండే వాహనాల డ్రైవర్లకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ అవగాహన తర్వాత ఉద్యోగులతోపాటు సంస్థ డ్రైవర్లు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ధీరేంద్ర సమ్మినేని 150 ప్రభుత్వ, కార్పొరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.