హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రగతికి జీవనాడుల వంటి ప్రాంతీయ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. కొన్నిచోట్ల భూసేకరణ సమస్యతో పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్న 459 మండలాల్లో 143 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్లేన్ రోడ్లు లేవు. ఉన్న సింగిల్ రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉండేవి. దాంతో ఈ రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారు. రూ.2,655 కోట్లతో 139 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మొత్తం 1,845 కిలోమీటర్లమేర రోడ్లను డబుల్ లేన్గా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 1,616 కిలోమీటర్లమేర డబుల్ లేన్ నిర్మాణం పూర్తయింది. మరో 232 కిలోమీటర్ల రోడ్డును డబుల్ లేన్గా మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు భూసేకరణ సమస్య ఏర్పడినట్టుఅధికారులు తెలిపారు. కొంతమంది భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదని అధికారులు అంటున్నారు.