హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రహదారులు గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చెందాయి. రహదారుల అభివృద్ధి జరిగితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ రంగానికి గణనీయంగా నిధులు విడుదల చేశారు. అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు సింగిల్ లేన్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలులేన్ల రోడ్లను అభివృద్ధి చేశారు.
ఇలా ఆదిలాబాద్, కుమ్రంభీమ్-ఆసిఫాబాద్ లాంటి అటవీ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లను తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నిర్మించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి మొత్తం రోడ్ల పొడవు 92,215 కిలోమీటర్లు ఉండగా, 2018 నాటికి 1,28,071 కిలోమీటర్లకు పెరిగింది. కేవలం మూడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 35,856 కిలోమీటర్ల రోడ్నెట్వర్క్ను పెంచినట్టు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్టాటిస్టికల్ బుక్లో ఈ గణాంకాలను వెల్లడించింది. అలాగే జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనాడూ జాతీయ రహదారుల గురించి పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 2687 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉన్నాయని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ప్రత్యేకంగా కృషిచేసింది. ఫలితంగా 2021 నాటికి తెలంగాణలోజాతీయ రహదారులు 3974 కిలో మీటర్ల పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
రాష్ట్రం ఏర్పడిన తరువాత అదనంగా 1287 కిలోమీటర్ల జాతీయ రహదారులను తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నట్టు తెలిపింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడంతో రాష్ట్ర రహదారులు కొద్దిగా తగ్గినట్టు నివేదించింది. రాష్ట్రం ఏర్పాటు సమయంలో తెలంగాణలో 3385 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉండగా, 2018 నాటికి 2149 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులు తగ్గాయని పేర్కొన్నది. రాష్ట్రం ఏర్పాటు నాటికి రాష్ట్ర రహదారులుగా ఉన్న 1,236 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా అభివృద్ధి చెందాయని ఆర్బీఐ తెలిపింది.