Rishi Sunak | బ్రిటన్ అంతటా వేసవి ఎండలు మండుతున్నాయి.. మరోవైపు బోరిస్ జాన్సన్ వారసుడిగా నూతన ప్రధాని ఎంపిక కోసం జరుగుతున్న కసరత్తు రాజకీయంగా మరింత వేడిని పెంచుతున్నది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ పోటీ పడుతుండటంతో మరింత వేడి ఎక్కువైంది. భారతీయుల పట్ల, భారత సంతతి వారి పట్ల శ్వేత జాతీయుల్లో వ్యతిరేకత ఎలా ఉన్నా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మధ్య జరుగుతున్న అంతర్గత ఓటింగ్ నాలుగో రౌండ్లోనూ రిషి సునాక్ టాప్లోనే ఉన్నారు.
సోమవారం జరిగిన మూడో రౌండ్ పోలింగ్లో 358 మంది ఎంపీలకు 357 మంది ఓటేశారు. వారిలో రెండో రౌండ్లో 115 మంది ఓటేస్తే.. తాజాగా 118 మందికి పెరిగింది. ఇది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో మూడింట రెండొంతుల ఓట్లకు రెండు స్థానాలు తక్కువ. ప్రధాని పదవికి పోటీ పడే ఇద్దరు ప్రధాన పోటీ దారులకు కనీసం 120 మంది ఎంపీల మద్దతు కావాలి. ఇక రెండో స్థానంలో ఉన్న వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ 92 (రెండో రౌండ్ కంటే 10 ఓట్లు ఎక్కువ) ఓట్లు పొందారు. మూడో స్థానంలో ఉన్న విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ 86, కెమీ బాడ్నోచ్ 49 నుంచి 58కి బలం పెంచుకున్నారు. నాలుగో స్థానంలో ఉన్న బాడినోచ్ ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పుడు రిషి సునాక్తోపాటు పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్ పోటీలో ఉన్నారు.
ఐదుఓ దశ- తుది విడుత బుధవారం జరుగనున్నది. ఈ దఫా పోలింగ్ తర్వాత మరో ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటారు. ఇప్పటివరకు జరిగిన టీవీ చానెళ్ల చర్చాగోష్టుల తీరు.. చివరి ఇద్దరు అభ్యర్థుల్లో రిషి సునాక్ నిలుస్తారని స్పష్టం అవుతుంది. ఇక ప్రస్తుత ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్.. తనను రిషి సునాక్ మోసగించారని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ ప్రధాని కాకుండా బోరిస్ జాన్సన్ అడుగడుగునా అడ్డుపడతారని చెబుతున్నారు. చివరి క్షణంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. మూడో దశలో టోరీ పార్టీ సభ్యుల ఓటింగ్లో రిషి సునాక్ ఓటమి పాలవుతారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, బ్రిటన్ ప్రధాని ఎవరన్నది ఆ పార్టీ వచ్చే సెప్టెంబర్ ఐదో తేదీన వెల్లడించొచ్చు.