ఖైరతాబాద్, నవంబర్ 16: పెట్రో, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రమంజిల్లోని సివిల్ సప్లయిస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పెట్రోధరలు పెంచడం వల్ల దాని ప్రభావం నిత్యావసరాలపై పడుతున్నదని, సామాన్యుడికి మోయలేని భారంగా మారిందని పేర్కొన్నారు. బీజేపీ గత ఏడేండ్లలో సంవత్సరాల కాలంలో కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకొచ్చి కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధరలకు కళ్లెం వేసేలా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో ఐద్వా ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి, ఎం వినోద, కే నాగలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు.