టికెట్ రేట్లు తగ్గించడం వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోతుందని ఏపీ ప్రభుత్వానికి తెలియజేశానని అన్నారు దర్శకుడు రామ్గోపాల్వర్మ. సోమవారం ఆయన అమరావతిలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ ‘ఐదు అంశాల్ని చర్చించాం. సినీరంగంలో నాకున్న 30ఏళ్ల అనుభవంతో పలు అంశాల్ని మంత్రికి వివరించా. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టం గురించి తెలియజెప్పా. నానిగారు కూడా చాలా విషయాల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటిపై సినీరంగానికి చెందిన వారితో కలిసి చర్చిస్తాం. పవన్కల్యాణ్, బాలకృష్ణను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనుకోవడం లేదు. టికెట్ ధరల తగ్గింపు ప్రభావం స్టార్హీరోలందరిపైనా ఉంటుంది. నేను ఇక్కడకు ఓ నిర్మాతగానే వచ్చాను. పరిశ్రమ తరపున రాలేదు. టికెట్ రేటును నిర్ణయించుకునే అధికారం సినిమా తీసేవాళ్లకే ఇవ్వాలి’ అని అన్నారు.