హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ‘రెండున్నరేండ్లుగా పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. హైడ్రా, మూసీ, మెట్రో, ఫ్యూచర్సిటీ, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీకి తెగబడుతున్నారు..’ అని బీఆర్ఎస్ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాల పునాదులపై సీఎం అయిన రేవంత్రెడ్డి, 30 నెలలుగా అదే పరంపర కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను గాలికొదిలి, అమ్మిన భూములను మళ్లీ అమ్ముకుంటూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై బురదజల్లుతూ పబ్బం గడుపు తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీలు మారిన ఆయన, గద్దెనెక్కిన తర్వాత అనుభవలేమి, చేతగానితనంతో తెలంగాణను భ్రష్టుపట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ రాయదుర్గం వద్ద ఉన్న ఎస్బీఐ భూమిని ఈ వేలం ద్వారా ఇతర కంపెనీలకు కట్టబెట్టారని, చివరకు హిల్ట్ పేరిట అల్యూమినియం కంపెనీకి చెందిన భూమిని కూడా వదల్లేదని ఆరోపించారు. రెండున్నరేండ్లలో రూ.12 వేల కోట్ల విలువైన భూములు అమ్మి ఉద్ధరించిందేమీలేదని దెప్పిపొడిచారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చీటర్, గజదొంగలా వ్యవహరించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిత్యం కేసీఆర్ నామస్మరణ లేనిదే రే వంత్రెడ్డికి నిద్రపట్టడంలేదని ఎద్దేవా చేశారు.
రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదు.. పక్కా దోపిడీ పా లన అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఉన్న నైతికవిలువలు కూడా ఆయనకు లేవని, అందుకే ఒకే భూమిని రెండుసార్లు తెగనమ్మి రిజిస్ట్రేషన్ చేసి చట్టవ్యతిరేక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్రెడ్డి రెండున్నరేండ్లలో సాగించిన భూ దందాలపై త్వరలోనే పీపుల్స్ చార్జ్షీట్ విడుదల చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల భూములు, పరిశ్రమలు, రైతుల హక్కులు, ప్రభుత్వ ఆస్తులు వ్యాపార ఒప్పందంలో భాగంగా మారిపోయాయని ఆరోపించారు. హిల్ట్ పాలసీ కాదని, దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అభివర్ణించారు.
సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2,800 పరిశ్రమల్లోని 1,100 కాలుష్య రహిత కంపెనీలను సైతం బలవంతంగా తరలించడం దుర్మార్గమన్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు మూగ ప్రేక్షకుల్లాగా మారిపోవడం దురదృష్టకరమని దాసోజు ఆవేదన వ్యక్తంచేశారు. హిల్ట్ ముసుగులో రూ. 6 లక్షల దందాలు చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట హామీలిచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత రైతాంగాన్ని వంచిస్తున్నదని ధ్వజమెత్తారు.