హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున ఆరుగురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ముఖ్యనేతలతో అన్ని కోణాల్లో చర్చించి మంగళవారం అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, పాడి కౌశిక్రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావును అభ్యర్థులుగా ప్రకటించిన కేసీఆర్.. వారికి బీ-ఫారాలు అందజేశారు.
అనంతరం అభ్యర్థులు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఎన్నికల పరిశీలకుడు బీ మహేశ్దత్ ఎక్కాలకు నామినేషన్ పత్రాలను అందజేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగిసింది. ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు జుజ్జుల భాస్కర్, బోజ్రాజ్ కోయల్కర్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
నామినేషన్ ఆమోదం పొందాలంటే పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులిద్దరినీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతిపాదించలేదని తెలిసింది. దీంతో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురై, టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నామినేషన్లను బుధవారం పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉన్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న తుది జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది.
టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు మంత్రులు కే తారకరామారావు, హరీశ్రావు ఒకే వాహనంలో అసెంబ్లీకి చేరుకోవడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మంత్రులు, ఎమ్మెల్యేల రాకతో అసెంబ్లీ ఆవరణలో సందడి నెలకొన్నది. తక్కళ్లపల్లి రవీందర్రావు గులాబీరంగు షర్ట్ ధరించి, తన కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం.
1984లో చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా రాజకీయ జీవితం ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా, జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్గా, మూడుసార్లు ఎంపీగా, ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మన్గా విభిన్న హోదాల్లో సేవలందించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1954 ఫిబ్రవరి 2న జన్మించిన ఆయన బీఎస్సీ చదివారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారిగా ఎంపీగా, మరోసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2003 వరకు మంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి 2018 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చదవిన ఆయన గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన పాడి కౌశిక్రెడ్డి నాయనమ్మ పేరిట పుష్పమాలాదేవి మెమోరియల్ ట్రస్ట్ నెలకొల్పి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1984, డిసెంబర్ 21న జన్మించిన ఆయన బీకాం చదివారు.
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకాశ్ 1981లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1981 నుంచి 1984 వరకు వరంగల్ మున్సిపాల్టీ వైస్ చైర్మన్గా పనిచేశారు. టీఆర్ఎస్ తరఫున 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 1954 ఫిబ్రవరి 18న జన్మించిన ఆయన పీహెచ్డీ చేశారు.
వెలమ సామాజిక వర్గానికి చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం వీసంపల్లి గ్రామంలో 1964 సెప్టెంబర్ 9న జన్మించారు. డిగ్రీ చదివారు. 1983లో టీడీపీ ఆవిర్భావ సమయంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 2007 జనవరి 29న టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009-2011 వరకు టీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగారు. 2011 నుంచి 2017 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పొలిట్బ్యూరో మెంబర్గా పనిచేశారు. 2017 నుంచి 2018 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2018 నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన పరుపాటి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ అధికారి. ఆయన తండ్రి రాజిరెడ్డి వకీల్. 1996లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రూప్ వన్ ఉద్యోగంలో చేరారు. 2007 కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో డిప్యూటీ కలెక్టర్గా, మెదక్ డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్గా, హైదరాబాద్ హుడా కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ తదితర హోదాల్లో పనిచేశారు. 2015లో మెదక్ జాయింట్ కలెక్టర్గా నియమితులైన ఆయన 2016 నుంచి 2021 నవంబర్ 15 వరకు సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు.