హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరముందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈపీటీఆర్ఐ రూపొందించిన క్యాలెండర్-2022ను మంత్రి అరణ్య భవన్లో గురువారం ఆవిష్కరించారు. ‘గ్రీన్ ఇనిషియేటివ్స్’ అనే ఇతివృత్తంతో ప్రతి నెలా జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యతను ఈ క్యాలెండర్లో పొందుపరిచినట్లు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అదర్ సిన్హా మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, సమతుల్య వాతావరణం కోసం, వాతావరణ మార్పులకు సంబంధించి కచ్ఛితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్ పరిశోధనలు చేయాలన్నారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ల విడుదలను నియంత్రించి భవిష్యత్ తరాలు ఈ భూమిపై సుఖంగా జీవించేలా అధ్యయనాలు జరగాల్సి ఉందన్నారు. విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్వీఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీలా పాల్గొన్నారు.