న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతుల ఆందోళనలు ఆగిపోవని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ సభ్యుడు, షెట్కారీ సంఘటన ప్రెసిడెంట్ అనిల్ జే ఘన్వత్ తెలిపారు. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నా రానున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా లబ్ధి మాత్రం చేకూరదని, ఆ ఎన్నికల వరకు ఆందోళనలు కొనసాగించేలా రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారని వెల్లడించారు. కనీస మద్దతు ధర డిమాండ్ ఇంకా ఉన్నదని, దానిపై రైతుల ఆందోళన కొనసాగుతుందని వివరించారు. సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్.. నివేదికను సిద్ధం చేసిందని, దాన్ని కోర్టు విడుదల చేయకుంటే తానే విడుదల చేస్తానని ప్రకటించారు. ఆ నివేదిక రైతులకు అనుకూలంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.