కాంగ్రెస్ నేత రేవంత్ కులాల మధ్య చిచ్చు పెడితే.. బీజేపీ నేత బండి సంజయ్ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నడు. పరమతంపై విషం చిమ్మేటోళ్లు నాయకులు ఎట్లా అవుతారు? మసీదులను కూలుస్తామంటూ, రెచ్చగొడతామంటేనో చూస్తూ ఊరుకోబోం. వరంగల్ సభలో రాహుల్ ఒక్కచాన్స్ ఇవ్వండని పలికిండు. ఆయన ముత్తాత నుంచి తల్లి వరకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. రైతులకు బీమా ఇవ్వలేనోళ్లు, తాగు, సాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లను ఆదరిస్తరా? ప్లీజ్.. ప్లీజ్.. అని ప్రజలను అడిగితే తాంబూలం, లవంగం, వక్కపొడి ఇస్తారు తప్ప అధికారం ఇవ్వరు.
– కేటీఆర్
ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేవుడి పేరిట మనుషులను అనుమానించే నీచ సంస్కృతి దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. మత పిచ్చితో బీజేపీ, కుల పిచ్చితో కాంగ్రెస్ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. తన పేరుతో తన్నుకొని, కొట్లాడుకోమని ఏ దేవుడు చెప్పాడో ఆ రాజకీయ పార్టీలే చెప్పాలని పేర్కొన్నారు.
ఖమ్మం నగరంలో శనివారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావుతో కలిసి సుమారు రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. ప్రపంచ దేశాలు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తూ ఆర్థికంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తుంటే భారతదేశం మాత్రం కులమతాల జాడ్యంతో తిరోగమన దిశలో పయనిస్తున్నదని అన్నారు.
అన్ని కులాలు, మతాలను సమానంగా చూసేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ పరమత సహనం కలిగిన వ్యక్తిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని చెప్పారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఛాందసవాదాన్ని ఎదుర్కొనే శక్తి, బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని అన్నారు. ఈ విషయాన్ని జాతీయస్థాయిలో ప్రచార సాధనాలు చెప్తున్నాయని తెలిపారు. కేంద్రం అన్నిరంగాల్లో రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్నదని, ఇందుకుతాను లెక్కలతో సహా ఉదాహరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతుంటే.. బీజేపీ నేత బండి సంజయ్ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మసీదులను తవ్వుతామనే నాయకులు శవం తేలితే మీది.. శివం తేలితే మాది అంటూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పరమతం మీద విషం చిమ్మేవారు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాత్మకమైన పనులు చేస్తున్నదని, విధ్వంసకర చర్యలకు పాల్పడుతూ, మసీదులను కూలుస్తామంటూ రెచ్చగొడతామంటేనో చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెలంగాణ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో కృషి చేయలేదన్నారు. ‘మొన్న వరంగల్ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వచ్చిండు. ఒక్కఛాన్స్ ఇవ్వండి అంటూ చిలక పలుకులు పలికిండు. ఆయన ముత్తాత నుంచి మొదలు పెడితే నాయనమ్మ, తండ్రి, తల్లి వరకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ వారు దేశానికి చేసిందేమిటి ? రైతులకు రైతుబీమా ఇవ్వలేనోళ్లు, సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపలేనోళ్లు, తాగునీటితో ప్రజల గొంతులు తడపలేనోళ్లను ప్రజలు ఎట్లా ఆదరిస్తరు. ప్లీజ్.. ప్లీజ్.. అని ప్రజలను అడిగితే తాంబూలం, లవంగం, ఒక్కపొడి ఇస్తారు తప్ప అధికారం ఇవ్వరు’ అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినా.. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని వారికే కేటాయించినా నోరుమెదపదని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేదో పొడుస్తామంటే ప్రజలు నమ్మరని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక పిట్ట కథను చెప్పారు. ‘చెడు వ్యసనాలకు లోనైన ఓ కొడుకు.. మంచిమాట చెప్పిన తల్లిదండ్రులను కొట్టి చంపాడు. చేసిన నేరానికి శిక్ష ఏం వేయాలి? ఇంతటి దుర్మార్గాన్ని ఎలా చూడాలి అని న్యాయమూర్తి ఆ నిందితుడిని అడిగితే తల్లీతండ్రి లేని అనాథను శిక్ష నుంచి తప్పించండి అన్నట్టు..’ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఆ విధంగానే ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షుడిగా రాష్ట్ర, దేశ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారని అన్నారు. కే-అంటే కాలువలు, సీ-అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగా కేసీఆర్ ఘనకీర్తిని రైతులు నిర్వచిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉన్నదని, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలనూ పార్టీ గుర్తిస్తుందని, వారి సేవలను వినియోగించుకుంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రూపాయి తీసుకొని పావలా తిరిగిస్తూ అదేదో ఘనకార్యం చేసినట్టు కేంద్ర మంత్రులు ప్రచారం చేయటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు ఇస్తే.. కేంద్రం మన వాటాగా తిరిగి ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని వివరించారు. అయినా తాము బాధపడటం లేదని, జాతి నిర్మాణంలో తెలంగాణ ప్రజల డబ్బు వినియోగిస్తున్నందుకు గర్వ పడుతున్నామని చెప్పారు.
నం.1 కార్పొరేషన్ ఖమ్మం
ఖమ్మం నగరం రాష్ట్రంలోనే నం.1 కార్పొరేషన్ అని కేటీఆర్ కితాబిచ్చారు. ఖమ్మం అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలని అన్ని మున్సిపాలిటీలకు పిలుపునిచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచనతో ఓ కార్యకర్తను రెచ్చగొట్టి ఆత్మహత్యకు పురికొల్పారని విమర్శించారు. ఆ చావును అడ్డం పెట్టుకొని శవాలపై పేలాలు ఏరుకునే దౌర్భాగ్యానికి కాషాయ పార్టీ నేతలు పూనుకున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్త చావు విషయంలో ఏం జరిగిందో ఖమ్మం ప్రజలకు పూర్తిగా తెలుసునని అన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా మారిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఏడాది ఖమ్మం వచ్చి ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గొంగడి పురుగు మాదిరిగా ఉన్న ఖమ్మాన్ని మూడేండ్లలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సీతాకోకచిలుకలా అభివృద్ధి చేసుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉన్నానని, ఖమ్మం ప్రజలపై ప్రేమను నిండుగా చూపించాలని మంత్రి కోరారు. బహిరంగ సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, నగర మేయర్ పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతీమాజోహ్రా, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, నగర కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్, భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.