తెలంగాణచౌక్, నవంబర్ 5: కేంద్రం పెంచిన పెట్రో ధరల భారాన్ని భరించలేకే ప్రజలు ఉప ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నల్లచట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి షాక్ ఇచ్చారని చెప్పారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ప్రైవేటీకరణ పేరిట లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. లేదంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.