దాద్రి, డిసెంబర్ 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూమూర్తులకు నిత్యారాధనలు వైభవంగా సాగాయి. బుధవారం తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
వైభవంగా నిత్య తిరుకల్యాణోత్సవం
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గంటన్నర పాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు జరిపారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ ఆళ్వార్లను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 25,70,660 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారికి 9 వెండి కలశాలు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి హైదరాబాద్కు చెందిన కారంచేడు వనజా విజయ దేశికా చార్యులు రూ.3.50 లక్షల విలువ చేసే 9 వెండి కలశాలను సమర్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ముఖ మండపంలో ఏఈఓ రఘుకు అందజేశారు.
ఉపాలయ దర్వాజలకు వెండి తొడుగులు..
లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నెలకొల్పిన ఉపాలయ దర్వాజలకు వెండి తొడుగులను బిగిస్తున్నారు. దాతల సహకారంతో స్తపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో రూపొందించిన తొడుగులను ప్రధానాలయ ముఖ మండపంలో ఆండాళ్ అమ్మవారి ఉపాలయ దర్వాజలకు బుధవారం ఏర్పాటు చేశారు. అలాగే దాతల సహకారంతో ఆళ్వారు సన్నిధి, రామానుజాచార్య సన్నిధి, విశ్వక్సేన సన్నిధికి సైతం వెండి తొడుగులను బిగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.