ఖమ్మం వ్యవసాయం, మార్చి 21: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు ఆల్టైం రికార్డు ధర పలికింది. వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకుంటూ వస్తున్న తెల్ల బంగారం.. సరిగ్గా వారం రోజుల తరువాత ఆల్టైం రికార్డు ధరను సొంతం చేసుకున్నది. ఆదివారం సెలవుదినం తరువాత తిరిగి మార్కెట్లో సోమవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో పత్తి యార్డు రైతులు 862 బస్తాలను తీసుకొచ్చారు. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తి పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ వ్యాపారులు సైతం పోటీపడుతుండడం వంటి కారణాలతో ఆన్లైన్ బిడ్డింగ్లో పంటను సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో గరిష్ఠ ధర క్వింటాకు రూ.10,600 పలికింది. మధ్య ధర సైతం ఇదే రేటు పలకడం విశేషం. కనీస ధర క్వింటాకు రూ.7,700 చొప్పున నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సీజన్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన పత్తి ధరలు.. పంట చివరి దశలో రికార్డును నెలకొల్పుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జమ్మికుంట మార్కెట్లో పత్తి పంటకు రాష్ట్రస్థాయిలో రికార్డు ధర క్వింటాకు రూ.10,600 పలికిన విషయం విదితమే. తాజాగా సోమవారం మరోసారి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అదే ధరతో తెల్ల బంగారం రికార్డు సొంతం చేసుకుంది. పత్తికి ఇంత స్థాయిలో ధర పలుకుతుండడంతో ఇంతకాలం పంటను నిల్వపెట్టుకొని మార్కెట్కు తీసుకొస్తున్న రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. కొద్ది రోజుల్లోనే రూ.11 వేల మార్క్ను సైతం దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.