హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత ఏడాది నెలకొల్పిన గరిష్ఠ డిమాండ్ను సరిగ్గా అదేరోజు బద్దలు కొట్టింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్తు వినియోగానికి ఈ రికార్డులు సజీవ సాక్ష్యాలు.
సరిగ్గా సంవత్సరం తరువాత
రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం 2:57 గంటలకు 13,742 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్ కావడం గమనార్హం. 2021 మార్చి 26న 13,688 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్తో రికార్డు సృష్టించింది. సరిగ్గా సంవత్సరం తరువాత అంటే.. 2022 మార్చి 26 రోజే పాత రికార్డును తిరగరాసింది. ఈయేడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, భూగర్భజలాలు పెరగటం, కొత్త పరిశ్రమలు ప్రారంభం అవుతుండటంతో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజా గరిష్ఠ డిమాండ్ నమోదైనట్టుగా విద్యుత్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
17 వేల మెగావాట్ల వరకూ ఇబ్బంది ఉండదు
రాష్ట్రంలో ఈ సీజన్లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 14,500 మెగావాట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాం. మన దగ్గర 17 వేల మెగావాట్ల వరకు నెట్వర్క్ను పటిష్ఠం చేశాం. డిమాండ్ పెరిగినా ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం దేశంలో విద్యుత్తు కొరత కనపడుతున్నది. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎలాంటి కొరత లేకుండా అందిస్తున్నాం. ప్రజలు విద్యుత్తును ఆదా చేయాలి. వృథా చేయకుండా ఉంటే విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టే.
– దేవులపల్లి ప్రభాకర్రావు, జెన్కో, ట్రాన్స్కో సీఎండీ