చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని, అయితే సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని అగ్ర నటుడు చిరంజీవి కోరారు. టికెట్ రేట్స్ను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్పై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని ఇతర రాష్ర్టాలను పరిశీలించి టికెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆన్లైన్ టికెటింగ్ విధానం హర్షించదగ్గ విషయం. అయితే టికెట్ రేట్స్ను కాలానుగుణంగా, దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీ పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. సరైన ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’ అంటూ చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.