సిటీబ్యూరో/బొల్లారం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): భూ వివాదంలో అల్వాల్కు చెందిన రియల్టర్ సికింద్రాబాద్ తిరుమలగిరిలో హత్యకు గురి కాగా.. ఈ కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులపై అర్ధరాత్రి కుక్కలను వదిలి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో అనుమానితులను పట్టుకునేందుకు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సోమవారం రాత్రి నగర పోలీసులు వందల కిలోమీటర్లు ఛేజ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన అనుమానితుడు సెల్ఫోన్ ఆఫ్ చేశాడు. తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్మీ పెద్ద కమేళా ప్రాంతంలో స్విఫ్ట్ డిజైర్ కారులో రక్తపుమడుగుల్లో పడి ఉన్న అల్వాల్ శ్రీనివాస్నగర్ ప్రాంతానికి చెందిన తోట విజయ్ భాస్కర్రెడ్డి మృతదేహాన్ని సోమవారం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. 120 గజాల స్థలం విషయంలో వరుసకు సోదరుడైన తోట నరేందర్రెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అల్వాల్ భారతినగర్లో ఉన్న ప్లాట్ విషయంలో నెల రోజులుగా గొడవ జరుగుతుండడంతో ఎట్టకేలకు మంగళవారం దానిని రిజిస్ట్రేషన్ చేస్తామంటూ చెప్పడంతో, ఉదయం 8.30 గంటలకు రూ.10లక్షల నగదు తీసుకొని బేగంపేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బయలుదేరాడు. సోమవారం సాయంత్రానికి శవమై తేలాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
భయంతో పోలీసులపై కుక్కలు
భాస్కర్రెడ్డి హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అల్వాల్ ప్రాంతంలో ఉన్న నరేందర్రెడ్డి ఇంటికి తిరుమలగిరి పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న అతడి సోదరుడు సురేందర్రెడ్డి పోలీసులు వస్తున్న విషయాన్ని గుర్తించి కుక్కలను వదిలాడు. దీంతో వారు మరికొంత మంది సిబ్బంది అక్కడికి రప్పించారు. అంతలో స్థానికుల సాయంతో సురేందర్రెడ్డిని అదుపులోకి తీసుకొని హత్య విషయమై ప్రశ్నించి వదలేశారు.
అర్ధరాత్రి ఛేజింగ్..
నరేందర్రెడ్డి తన స్నేహితుడితో కలిసి సిటీ నుంచి నాగర్ కర్నూల్ వైపు వెళ్తున్నట్లు సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందు సోమవారం రాత్రి నాగర్కర్నూల్ బయలు దేరి వెళ్లారు. అదే సమయంలో నరేందర్రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నాడు. తన స్నేహితుడిని అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు అల్వాల్ చేరుకొని అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నరేందర్రెడ్డి తనను ఇక్కడ దింపి వెళ్లాడని.. నరేందర్రెడ్డి తన ఫోన్ను ఇబ్రహీంపట్నంలో ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. భాస్కర్రెడ్డి హత్యలో 120 గజాల ప్లాటు విషయమే ప్రధాన కారణమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులే నిందితులా? లేక దాయాదుల మధ్య వివాదాలు జరుగుతుండడం, రూ.10 లక్షలతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం వంటి విషయాలను గుర్తించిన నేరగాళ్లు పథకం ప్రకారం హత్య చేశారా? అనే విషయాలపై తిరుమలగిరి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.