సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): వాహనాల హైపొథికేషన్ ట్రాన్స్ఫర్కు అయ్యే ఖర్చును తప్పించేందుకు నకిలీ ఆర్సీలను(రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఓ ముఠాను మంగళవారం సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పట్టుకుంది. రూ.1000ల ఫీజును తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు, మరికొద్ది మంది బ్రోకర్ల పిసినారి బుద్ధిని పసిగట్టిన ఈ ముఠా నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేసి రూ.900లకు విక్రయించేది. ఏడాది కాలంగా ఈ ముఠా దాదాపు 1000 వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో వీరి అక్రమ వ్యాపారం విస్తరిస్తుండటంతో సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ సందీప్ సారథ్యంలోని ఎస్ఓటీ శంషాబాద్ సభ్యులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు.
వారి నుంచి 1200 నకిలీ ఆర్సీ కార్డులు, స్టాంపులు, కంప్యూటర్లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. అల్వాల్కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మియాపూర్కి చెందిన రమేశ్లు వేలం పాటల్లో పాల్గొని వాహనాలను కొనేవారు. ఆ వాహనాలకు ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) మార్పిడి చేయాలంటే వెయ్యి రూపాయల ఫీజుతో పాటు కొన్ని నెలలు ఆగాల్సి వచ్చేది. ఈ సమస్యను తప్పించుకునేందుకు ఈ ఇద్దరు చమన సతీష్, షేక్ జహంగీర్, గణేశ్, సయ్యద్ హుస్సేన్, సంపత్తో కలిసి నకిలీ ఆర్సీలతో పాటు ఆధార్ కార్డులను రూపొందించడం ప్రారంభించారు. ఈ అక్రమ దందాను ఇతర రాష్ర్టాలకు విస్తరించారు. ఇది గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు నాలుగు రోజుల పాటు ఆధారాలు సేకరించి ఆ ముఠా ఆట కట్టించారు.
వెనక్కి వచ్చిన కార్డుతో..
ఈ ముఠాలో సభ్యుడు సంపత్ భదాద్రి కొత్తగూడెం లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్గా పని చేస్తుంటాడు. ఆర్సీల డెలివరీలను గమనించే అతడు వెనక్కి వచ్చే వాటిలో మూడు నుంచి ఐదు వరకు దొంగిలిస్తాడు. వాటిని యూసుఫ్గూడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్ షేక్జహంగీర్, కిషన్బాగ్కు చెందిన మరో ఏజెంట్ సయ్యద్హుస్సేన్కు రూ.200లకు విక్రయిస్తాడు. వీరు ఈ కార్డులను వేలంలో వాహనాలు కొనుగోలు చేసే మియాపూర్నకు చెందిన రమేశ్, సతీశ్లకు విక్రయిస్తారు. వారు గణేశ్కు అప్పగించి ఆర్సీ కార్డులపై ఉన్న సమాచారాన్ని తొలగించి కొత్త ఆర్సీని తయారు చేస్తారు.
ఆధార్కార్డు సైతం..
ఈ ముఠా వేలంలో కొనుగోలు చేసిన వాహనాలను అమ్మేందుకు ఆర్సీలతో పాటు కార్డుపై ఉండే యజమాని ఆధార్ కార్డునూ తయారు చేస్తున్నారు. వేలంలో వాహనం దక్కిన తర్వాత ఈ ముఠా సభ్యులు బ్యాంక్ అధికారుల నుంచి వాహనదారుల ఆధార్కార్డుల జిరాక్స్ కాపీలను సైతం సేకరించేవారు. ఈ తర్వాత సికింద్రాబాద్లోని ప్లాస్టిక్ పేపర్ను కొనుగోలు చేసి కార్డులను ముద్రించేవారు. ఈ ముఠాను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ బృందాన్ని సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ సందీప్, శంషాబాద్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.