ముంబై, జనవరి 29: ఆర్థిక పరమైన నష్టాల బారిన పడకుండా, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ విధానాల్ని అవలంభించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజల్ని కోరింది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన ఒక బహిరంగ ప్రకటనలో.. పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సొషల్ మీడియా టెక్నిక్లు, మొబైల్ ఫోన్ కాల్స్లతో సహా పలు వినూత్న పద్దతులతో మోసకారులు తప్పుదోవపట్టిస్తున్నారని, ఈ నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు జరిపేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, రాయితీలు ఇప్పిస్తామంటూ వచ్చే మోసపూరిత మెసేజ్లు, కాల్స్, తెలియని లింక్స్, తప్పుడు నోటిఫికేషన్లు, అనుమతిలేని క్యూఆర్ కోడ్స్ పట్ల జాగ్రత్త వహించాలన్నది. వీటి ద్వారా యూజర్ ఐడీ, లాగిన్/ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, ఓటీపీలతో పాటు డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు తస్కరిస్తారని ఆర్బీఐ హెచ్చరించింది.