ఎంఐ-17వీ5 హెలికాప్టర్ బ్లాక్బాక్స్ కోసం ఘటనాస్థలిలో ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇంకా దాన్ని గుర్తించలేదన్నారు. విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్బాక్స్ స్టోర్ చేసుకుంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు.
జనరల్ బిపిన్ రావత్, మధూలిక రావత్, బ్రిగేడర్ ఎల్ఎస్ లిద్దర్, ఎస్ఎం వీఎస్ఎం, లెఫ్టినెంట్ కర్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గుర్సేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బీ సాయితేజ, హవ్ సత్పాల్, మరో ఐదుగురు సిబ్బంది.
వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్సీ)లోనే జనరల్ రావత్ డిగ్రీ పూర్తి చేశారు. అదే కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బుధవారం అయన ప్రయాణమయ్యారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్: సీడీఎస్ బిపిన్రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడే ఓ నిర్ధారణకు రావడం సరికాదని తెలంగాణ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్కుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యంత కీలకమైన భద్రతాధికారి ప్రయాణం విషయంలో ఎంతో కట్టుదిట్టమైన ప్రొటోకాల్ ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు కూడా మూడంచెల భద్రత పరిశీలన ఉంటుందని తెలిపారు.